India's Population: భారత జనాభా చైనాను మించిపోయిందని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలోకి వచ్చినట్లు కొన్ని రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి వెల్లడించిన విషయం తెలిసిందే. జనాభా పరంగా భారత్ చైనాను మించి పోయిందని వార్తలు వచ్చాయి. చైనా జనాభా 142 కోట్ల 57 లక్షలు కాగా.. భారత్ జనాభా 142 కోట్ల 86 లక్షలకు పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటి లెక్కల ప్రకారం జనాభా అంచనాను ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. భారత్‌లో చివరిసారి 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టారు. మూడేళ్ల క్రితం జరగాల్సి ఉన్నా...కరోనా సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఓ వంతు వాటా భారత్, చైనాదే ఉంది. తాజాగా జనాభా విషయంపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 


139.23 కోట్లుగా భారత్ జనాభా: కేంద్రం


జాతీయ కమిషన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచురించిన టెక్నికల్ గ్రూప్ నివేదిక ప్రకారం.. జులై 1, 2023 నాటికి జనాభా అంచనా 139.23 కోట్లు అని లోక్‌సభలో కేంద్ర సర్కారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. కరోనా కారణంగా 2021 జనాభా లెక్కలు నిర్వహించలేదని చెప్పుకొచ్చారు. అలాగే 2023 నాటికి భారత్ లో ముస్లిం జనాభా 20 కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ఇటీవల, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో మాట్లాడుతూ 2023 నాటికి భారత్ లో ముస్లిం జనాభా 19.7 కోట్లు ఉంటుందని అంచనా అని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు 14.2 శాతం ఉన్నారు. 2023 అంచనా ప్రకారం ముస్లింల జనాభా 19.7 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. 


పడిపోతున్న చైనా జనాభా


పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా(China Population) ...ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే...సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా...భారత్‌ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా...ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే.. చైనాను దాటేసి మరీ భారత్‌ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది. చైనా విషయానికొస్తే...జనాభాలో ఈ తగ్గుదల 2050 వరకూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి కనీసం 11 కోట్ల మేర జనాభా తగ్గుతుందని చెబుతున్నారు. "చైనా ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో అంతరాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా విధానాల్లో మార్పు చేసుకోక తప్పదు" అని స్పష్టం చేస్తున్నారు.