ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలో కదలిక వచ్చింది. దీనిపై అధ్యయనంతోపాటు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకునేందుకు కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. దీనికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ లీడ్ చేయనున్నారు. 


ఐదుగురు సభ్యులు వీళ్లే


రాజీవ్‌ గౌబా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం అందులో పలు కీలకమైన శాఖలకు స్థానం కల్పించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజిన శాఖ కార్యదర్శులను భాగం చేసింది. వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. 
కేంద్ర ఆదేశాల మేరకు త్వరగా రిపోర్టు ఇవ్వడానికి సమాయత్తమైన కమిటీ.. ఈ నెల 22న తొలిసారిగా సమావేశం కానుంది. ప్రభుత్వానికి త్వరగా రిపోర్ట్ ఇవ్వడానికి అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. 


నవంబర్‌లోనే ఆదేశాలు


ఎస్సీ రిజర్వేషన్లలో సబ్-కేటగిరైజేషన్ ప్రక్రియలో భాగంగా ఒక కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని నవంబరు 24నే కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ దీనిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం కమిటీ నియమిస్తున్నట్లుగా ప్రధాని మోదీ అదేశాలు ఇచ్చారు. ఇన్నాళ్లకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు అయింది. 


హైదరాబాద్‌లో మోదీ హామీ


మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) గత 30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం పోరాడుతోంది. దీన్ని మందక్రిష్ణ మాదిక స్థాపించారు. గత మూడు దశాబ్దాలుగా జరిగిన ప్రతి పోరాటంలో బీజేపీ వారికి అండగా నిలుస్తోందని హైదరాబాద్ సభలో మోదీ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. మాదిగలకు సాధికారత కల్పించడానికి ఓ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఎమ్మా్ర్పీఎస్ పోరాటం న్యాయమైనదని తాము భావిస్తున్నట్లు చెప్పారు.


30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ పోరాటం


మాదిగలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని షెడ్యూల్డ్ కులాలలో (ఎస్సీ) ఎక్కువ భాగం ఉన్నారు. దీనివల్ల ఉద్యోగాలు సహా ఇతర విషయాల్లో రిజర్వేషన్లు, ఇతర బెనిఫిట్స్ తమకు అందడం లేదని వాదన వారిలో ఉంది. అందుకే ఎమ్మార్పీఎస్ గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతోంది.