Vegetable Price Hike: కిలో టమాటా ప్రస్తుతం 150 నుంచి 200 రూపాయలకు వరకు ఉంది. ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్న ధరలు మరికొన్ని రోజుల్లో పాతాళానికి పడిపోవచ్చు. ఉల్లిపాయల ధరలు కూడా అంతే.. అయితే ఆకాశంలో ఉంటాయి.. లేదంటే పాతాళానికి పడిపోతాయి. ఈ ధరల హెచ్చుతగ్గులు ఇటు సామాన్యులను, అటు రైతులను ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశంలో ఆహార నిల్వలను పెంచి ధరల హెచ్చుతగ్గులు లేకుండా చూసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బఫర్ స్టాక్ ఉంచుకుని రేట్లు భారీగా పెరిగిన సందర్భంలో.. ఆ నిల్వలతో ధరలను స్థిరీకరించాలని, చౌకగా దొరికిన సందర్భంలో వాటిని నిల్వ చేసుకోవాలన్న ఆలోచన చేస్తోంది. అయితే బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడంలో ప్రధాన ఇబ్బంది వాటిని చెడిపోకుండా కాపాడటం. కూరగాయలను చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంచగలిగితేనే కేంద్రం అనుకుంటున్న పరిష్కారం ఫలితాన్నిస్తుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇరేడియేషన్ సాంకేతికతను వాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఇరేడియేషన్ టెక్నాలజీ ఎలా పని చేస్తుందంటే?


ఈ పద్ధతిలో కూరగాయలను ఆయనీకరణానికి గురి చేస్తారు. గామా, ఎక్స్ కిరణాలను వాడి కూరగాయలను రేడియేషన్ కు గురి చేస్తారు. ఇలా చేయడం వల్ల కూరగాయల్లోని సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా నశించిపోతాయి. దీంతో కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లిపాయలకు ఇరేడియేషన్ చేస్తే అవి చెడిపోకుండా ఉండటంతో పాటు అవి మొలకెత్తవు, కుళ్లిపోవు, వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఈ పద్ధతిలో కూరగాయల రంగు, రుచిలో ఎలాంటి మార్పు రాదు. అదే స్థాయి నాణ్యత, రుచి, ఆకృతి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఉల్లిపాయల బఫర్ స్టాక్ పై ఈ ప్రయోగాలు చేపట్టింది కేంద్రం. బాబా అటామికి రీసెర్చ్ సెంటర్ - BARC లో ఉల్లిని ఇరేడియేషన్ చేసే పని జరుగుతోంది. 3 లక్షల టన్నులకు పైగా బఫర్ స్టాక్ ను కొనుగలు చేసి వాటిని సురక్షితంగా ఉంచేందుకు కసరత్తు చేస్తోంది.


లూయిస్ స్టాడ్లర్ కనుగొన్న ఇరేడియేషన్


ఆహార వికిరణాన్ని అమెరికాలోని మిస్సౌరీ విశ్వవిద్యాలయానికి చెందిన లూయిస్ స్టాడ్లర్ ఈ పద్ధతిని కనుగొన్నారు. ఈ ప్రయోగాన్ని మొదటి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి, కొన్ని రకాల తృణధాన్యాలపై చేపట్టారు. ఈ ఇరేడియేషన్ పద్ధతి ద్వారా ఉల్లిని నిల్వ చేయడం వల్ల ఎదురయ్యే 25 శాతం నష్టాన్ని.. 10 శాతానికి తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


ఈ పద్ధతి సురక్షితమేనా?


ఇరేడియేషన్ పద్ధతి ద్వారా నిల్వ చేసిన ఆహారాన్ని తింటే ఎంత వరకు సురక్షితం అనే అంశంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పలు పరిశోధనలు నిర్వహించాయి. ఇరేడియేషన్ ప్రక్రియ పూర్తి సురిక్షితమైనదని ఆయా అధ్యయనాల్లో తేలింది. ఈ ప్రక్రి ద్వారా కూరగాయల జీవిత కాలాన్ని పెంచడమే కాకుండా.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఇరేడియేషన్ పద్ధతి ద్వారా కురగాయలపై చేరే బ్యాక్టీరియా, క్రిమికీటకాలు, సూక్ష్మక్రిములు నశించిపోతాయి. దీని వల్ల ఆయా కూరగాయలు చెడిపోవు, వాటిని తింటే రోగాలు రావు.