టాటా స్టీల్‌కు చెందిన జంషెడ్‌పూర్ ప్లాంట్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. కోక్ ప్లాంట్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.


సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని కంపెనీకి అధికారి ఒకరు ధృవీకరించారు.


ఈరోజు ఉదయం 10:20 గంటలకు, జంషెడ్‌పూర్ వర్క్స్‌లోని కోక్ ప్లాంట్ బ్యాటరీ 6 వద్ద పేలుడు జరిగింది. ఫౌల్ గ్యాస్ లైన్‌లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికి బ్యాటరీ 6ను ఆపేశారు. 






అంబులెన్స్, అగ్నిమాపక దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో మరో ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాయి. గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరించాయి. ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం టీఎంహెచ్‌కు తరలించారు. ఛాతీలో నొప్పి ఉందని ఫిర్యాదు చేసిన మరో ఉద్యోగిని కూడా పరిశీలన కోసం TMHకి పంపారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది.


ఈ సంఘటన ఎలా జరిగింది.. ఎక్కడ లోపం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటర్నల్‌ విచారణకు కంపెనీ ఆదేశించింది. అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 






జనవరి 18, 2021న జంషెడ్‌పూర్ వర్క్స్‌కు చెందిన స్లాగ్ రోడ్ గేట్ సమీపంలో ఓ ప్రమాదం జరిగింది. హాట్ మెటల్ పూలింగ్ పిట్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ చిన్నపాటి పేలుడుకు ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.


2015 నవంబర్‌ 16లో కూడా కోక్‌ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. నవంబర్ 2013న జరిగిన పేలుడు కారణంగా కనీసం 11 మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్‌డీ గ్యాస్ హోల్డర్‌లో పేలుడు సంభవించడంతో పక్కనే ఉన్న గ్యాస్ పైప్‌లైన్‌లో మంటలు చెలరేగాయి.