Haryana Assembly Election Results 2024:  ఇంపాక్ట్ ప్లేయర్. ఐపీఎల్ చూసేవాళ్లకు బాగా తెలిసిన విషయమే. మ్యాచ్‌ గమనాన్ని బట్టి ఓ ప్లేయర్‌ను అదనంగా తీసుకుంటారు. అది బ్యాటింగ్ బౌలింగ్, ఆల్‌రౌండర్ ఎవరైనా కావచ్చు. మ్యాచ్ గెలవడానికి ప్రత్యర్థి జట్టు వ్యూహాలను చిత్తు చేయడానికి ఉపయోగిస్తుంటారు. దీన్నే ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది బీజేపీ. ఐపీఎల్‌కే పరిమితమైన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను రాజకీయాల్లో వాడేస్తోంది. 

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజల మూడ్‌ను తెలుసుకుంటుంది. అక్కడ సీఎం ఇతర నేతలపై అభిప్రాయ సేకరణ చేస్తుంది. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్‌ను రంగంలోకి తీసుకొస్తుంది. అప్పటి వరకు ఉన్న సీఎంను మార్చేసి కొత్త వ్యక్తితో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సైలెంట్‌గా బీజేపీ అల్లుకుంటున్న వ్యూహం. ఎక్కడ ఎవర్ని ప్రోత్సహించాలో వాళ్లను ప్రజల ముందుకు తీసుకొస్తుంది. వారి అభిమాన్ని పొందుతోంది.   

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యపరిచాయి. బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా మంది అంచనాలు తలకిందులు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇక్కడ తప్పాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌ ఘనవిజయం సాధిస్తుందని చెబితే వాస్తవ ఫలితం మరొకటి వచ్చింది. హర్యానాలో బీజేపీ చరిత్ర సృష్టించడం వెనుక పెద్ద స్కెచ్‌ ఉందని తెలుస్తోంది. అదే ఇంపాక్ట్‌ సీఎం ఫార్ములా వర్కౌట్ చేసింది. 

హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత చాలానే  ఉంది. ఈ వ్యతిరేకతతోపాటు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నీ బిజెపికి నష్టం చేస్తాయని గ్రహించిన బీజేపీ అధినాయకత్వం తన ఫార్ములాను అమలు చేసింది. హర్యానా ఎన్నికలకు 7 నెలల ముందు దీన్ని అమలు పరిచింది.  
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 7 నెలల ముందు ఖట్టర్‌ను తొలగించిన బీజేపీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2019 ఎన్నికల్లో కూడా ఖట్టర్ నాయకత్వంలోనే పోటీ చేసింది. బీజేపీకి అప్పుడు పెద్దగా మెజారిటీ రాలేదు. ఏదో జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

అందుకే 2024లో రిస్క్ తీసుకోవద్దని అనుకున్న బీజేపీ ఎన్నికలకు 7 నెలల ముందు ఖట్టర్‌ను తొలగించింది. ప్రభుత్వ బాధ్తను నాయబ్ సింగ్ సైనీకి అప్పగించింది. సైనీ నాయకత్వంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ న్యూ ఫేస్‌తో రాజకీయం చేసింది. ఇది వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది. నాయబ్ సింగ్ సైనీపై ప్రజల్లో విశ్వాసం ఉందని ఫలితాల చూస్తే అర్థమవుతుంది. పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ వ్యూహం ఫలించింది. 

ఒక్క హర్యానాలోనే కాదు నాలుగు రాష్ట్రాల్లో ఈ ఫార్ములా హిట్ 
ఎన్నికల ముందు హఠాత్తుగా సీఎంను మార్చి కొత్త ముఖంతో ప్రజల్లోకి వెళ్లడం బీజేపీకి కొత్త కాదు. ఇంతకు ముందు కూడా బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఈ ఫార్ములాను ప్రయోగించింది. విజయవంతమైంది. ఉత్తరాఖండ్, త్రిపుర, గుజరాత్‌లలో ఇదే ప్రయోగంతో హిట్ కొట్టింది. 

రాష్ట్రం తొలగించిన సీఎం  కొత్త సీఎం ఎన్నికలు  ఫలితం 
గుజరాత్ విజయ్ రూపానీ భూపేంద్ర పటేల్ (సెప్టెంబర్ 2021 నుంచి) డిసెంబర్ 2022 అధికారంలోకి వచ్చారు
ఉత్తరాఖండ్   తీరత్ సింగ్ రావత్ పుష్కర్ సింగ్ ధామి (జూలై 2021 నుంచి) ఫిబ్రవరి 2022 అధికారంలోకి వచ్చారు
త్రిపుర   బిప్లబ్ దేవ్ మానిక్ సాహా (మే 2022 నుంచి) ఫిబ్రవరి 2023 అధికారంలోకి వచ్చారు
హర్యానా   మనోహర్ లాల్ ఖట్టర్ నాయబ్ సింగ్ సైనీ (మార్చి 2024 నుంచి) అక్టోబర్ 2024 అధికారంలోకి వచ్చారు.