What Is The Best Place To Travel In Summer: ఎండాకాలం ఇలా మొదలయిందో లేదో అప్పుడే చాలా ప్రాంతాల్లో సూరీడు దయలేకుండా 40 డిగ్రీలు కొట్టేస్తున్నారు. మరి ఈ మండుటెండలను తప్పించుకోవటానికి ఒకే ఒక మార్గం చల్ల చల్లని ప్రదేశాలకు చెక్కేయటం. అలాంటి ప్రాంతాల కోసం ఎంతో దూరం వెళ్లక్కర్లేదు. మన ఇండియాలోనే  కూల్ కూల్ గా, రిఫ్రెషింగ్ గా సమ్మర్ లో ఎంజాయ్ చేయగల ఎన్నెన్నో ప్రదేశాలు ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా?


కాశ్మీర్


భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన కాశ్మీర్. భారతదేశంలోని ఎంతో అందమైన,చల్లటి ప్రాంతం. చారిత్రాత్మకంగా జమ్మూ, కాశ్మీర్ లో భాగం. జమ్ము& కాశ్మీర్ 2019 లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. కాశ్మీర్ లోయ చుట్టుపక్కన చెప్పుకోదగ్గ ప్రధాన సిటీలు శ్రీనగర్, గుల్మార్గ్, అనంత్‌నాగ్, బారాముల్లా. కాశ్మీర్ లో ఉండటానికి హౌస్‌బోట్‌లు, గెస్ట్‌హౌస్‌లు, హోమ్‌స్టేలు తదితర వసతులు అందుబాటులో ఉంటాయి. 


కాశ్మీర్‌కు ఎలా చేరుకోవాలి?


శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి కాశ్మీర్‌ చేరుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి మెట్రో సిటీల నుంచి లేదా జమ్మూ నుంచి రోడ్డు మార్గం ద్వారా లోయ అందాలను ఆస్వాదిస్తూ లాంగ్ డ్రైవ్ కి వెళ్లొచ్చు.  అక్టోబర్ నుంచి జూన్ వరకు కాశ్మీర్ లోయ చూడటానికి మంచి సమయం. 


వయనాడ్


వెస్టర్న్ ఘాట్స్ మధ్య, పొగమంచు ఉదయాలను ఆస్వాదిస్తూ, విస్తారమైన సుగంధ తోటలు, వన్యప్రాణులతో రిఫ్రెష్ రిట్రీట్‌ను పొందాలంటే వాయనాడ్ కు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే. ఒక్కసారి వెళ్తే ఇంకోసారి మిమ్మల్ని ఆపటం ఎవరికైనా అసాధ్యమే మరి! పచ్చని చీర కట్టుకున్నట్టు ఇక్కడి ప్రకృతి అందం మాటల్లో చెప్పలేనిది. అంతేగాక, ట్రెక్‌లు, సందర్శనా స్థలాలు ఎంతో ఆహ్లాదపరుస్తాయి. ఉండటానికి రిసార్ట్లు, హోటళ్లు అందుబాటులో ఉంటాయి. 


వయనాడ్ ఎలా చేరుకోవాలి?


సమీప విమానాశ్రయం కోయిక్కోడ్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయం, సుమారు 65 కి.మీ దూరంలో ఉంది. కేరళ, కర్ణాటకలోని ప్రధాన నగరాల నుంచి రోడ్ మార్గంలో చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి రైలు మార్గంలోనూ చేరుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని సంవత్సరం పొడవునా ఏ సమయంలోనైనా చూడటానికి అనువుగా ఉంటుంది. 


రిషికేశ్


గంగానది, గంభీరమైన హిమాలయాలు రిషికేశ్ కు బాడీగార్డ్స్ లా చుట్టు నిలబడినట్టు కనపడే సుందరమైన ప్రదేశం. వేసవికాలంలో ఆధ్యాత్మిక అన్వేషకులకు, సాహస యాత్రికులకూ కేంద్రం ఈ చోటు. నది వైపు నుంచి చల్లని గాలి ఆధ్యత్మిక కీర్తనలతో ఇటు ప్రశాంతత అటు థ్రిల్ కలిగిస్తుంది. ఇక్కద బస చేయటానికి గంగ నదికి దగ్గరలో ఆశ్రమాలు, హోటళ్లు అందుబాటులో ఉంటాయి. 


రిషికేశ్ ఎలా చేరుకోవాలి?


సమీప విమానాశ్రయం డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం, సుమారు 35 కి.మీ దూరంలో ఉంది. రిషికేశ్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన భారతీయ నగరాలకు అనుసంధానించబడి ఉంది. న్యూఢిల్లీ, ఇతర నగరాల నుంచి బస్సులు క్రమం తప్పకుండా నడుస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రైలు మార్గంలో గానీ, విమానంలో గానీ దగ్గరి ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి రిషికేశ్ కు బస్సులు, క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.