Cylinder Blast in UP: యూపీలోని దియోరియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తల్లి, ముగ్గురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. ఉన్నట్టుండి గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించింది. టీ పెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 


"టీ పెడుతున్న సమయంలోనే ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం. ఈ ఘటనలో ఇంకెవరికీ గాయాలు కాలేదు. ఎందుకు ప్రమాదం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాం"


- పోలీసులు




ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడం వల్ల స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు ఆర్పేందుకు అందరూ ఇంటి వద్ద గుమిగూడారు. తరవాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేసింది. పోలీసులతో పాటు ఫోరెన్సిక్ అధికారులు కూడా  ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.