AIR India Flight Emergency Landing In Trichy Airport: ఎయిరిండియా (Air India) విమానం గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిలైనట్లు గుర్తించిన పైలెట్లు.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) ప్రకటించారు. దీంతో తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో (Trichy Airport) అత్యవసర ల్యాండింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. తమిళనాడులోని తిరుచ్చి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. పైలెట్లు వెంటనే తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ అధికారులను అప్రమత్తం చేయగా.. వారు ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తీవ్ర ఉత్కంఠ మధ్య విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులతో పాటు అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు.








ఇదీ జరిగింది






ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమాన చక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలెట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయగా అప్రమత్తమైన అధికారులు తిరుచ్చి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో విమానం సేఫ్‌గా ల్యాండ్ కావాలంటే అందులోని ఇంధనం నిర్దేశిత స్థాయి వరకూ తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే విమానం ల్యాండింగ్ చేసే వీలుంటుంది.


ఈ క్రమంలో సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన పైలెట్లు.. దాదాపు 2 గంటల పాటు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇదే టైంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ముందస్తు ఏర్పాట్లు సైతం చేశారు. తిరుచ్చి ఎయిర్ పోర్టులో దాదాపు 20 అంబులెన్సులు, 20 అగ్నిమాపక యంత్రాలతో పారా మెడికల్ సిబ్బందిని సైతం సిద్ధంగా ఉంచారు. అయితే, విమానం ఎట్టకేలకు పైలెట్లు సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: Ratan Tata: హలో నేను రతన్ టాటాను మాట్లాడుతున్నా - ఆయన ఫోన్ చేస్తే ఖాళీ లేదు తర్వాత రమ్మన్నాం, ఆ కథేంటంటే?