ABP Southern Rising Summit 2023: ఏబీపీ సదరన్ రైజింగ్‌ సమ్మిట్‌ 2023 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రాజకీయాల్లో మహిళల పాత్ర, గవర్నర్‌ పాత్ర, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఇలా చాలా అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. 


ఈ సమ్మిట్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్‌ పాండే ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దక్షిణాది రాష్ట్రాల ప్రయాణం మానవ జాతికే స్ఫూర్తిగా ఉంటుందని కితాబు ఇచ్చారు. దక్షిణాది చాలా పురోభివృద్ధి సాధించిందన్నారు. దక్షిణ భారతదేశ చరిత్ర సంస్కృతి, ఆర్థిక పురోగతి, సామాజిక ఐక్యత సమ్మేళనమని అభిప్రాయపడ్డారు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక జిడిపిని కలిగి ఉన్నాయని... ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో దక్షిణ, ఉత్తరాది మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉందని తెలియజేశారు. 



దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక పురోగతి, సాంస్కృతిక సంపద, సామాజిక సామరస్యాన్ని పురస్కరించుకుని ఏబీపీ నెట్వర్క్ 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023' పేరుతో సెమినార్ నిర్వహిస్తోంది. వ్యాపారం, రాజకీయాలు, సినిమా, క్రీడలు, సైన్స్ వంటి అనేక రంగాల్లో రాణించిన ప్రముఖులను ఒకే వేదికపై తీసుకొచ్చింది. ఆసక్తికరమైన చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 


ఐదు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కారణాలు, దక్షిణ భారతదేశ ప్రయాణం స్ఫూర్తిని, దార్శనిక ఆలోచనలు, వ్యక్తిత్వాలను దేశానికి తెలియజేసేందుకు  ఎబిపి నెట్వర్క్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. 


"ఏబిపి సదరన్ రైజింగ్ సమ్మిట్"
'న్యూ ఇండియా'పై తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఏబీపీ తరఫున 'ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్' అంటే 'రైజ్ ఆఫ్ ద సౌత్' అనే సెమినార్‌లో వివిధ రంగాల్లో దిగ్గజాల సమక్షంలో జరుగుతోంది. రాజకీయాలు, పరిశ్రమలు, సినిమా, వ్యాపారం, క్రీడలు, సైన్స్, సంగీతం సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొని రాజకీయాలు, భిన్నత్వం, 2024 లోక్ సభ ఎన్నికల్లో మహిళల పాత్ర సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. చెన్నై నుంగంబాక్కంలోని తాజ్ కోరమాండల్‌లో జరుగుతున్న ఈ సదస్సును news.abplive.com, abpnadu.com, abpdesam.com వెబ్ సైట్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. 




దక్షిణ భారత రాజకీయాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ టైంలో సదస్సు జరుగుతోంది. బీజేపీతో పొత్తు నుంచి అన్నాడీఎంకే వైదొలగడం, సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వంటి కీలక పరిణామాల మధ్య దక్షిణ భారత ఎదుగుదలపై సదస్సు చర్చ జరుగుతోంది. 


తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దీపం వెలిగించి సదస్సు  ప్రారంభించి 'గవర్నర్ పాత్ర పునర్నిర్వచించడం' అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్ అంతర్జాతీయ వేదికపై భారత్ పాత్రపై అభిప్రాయాలు పంచుకున్నారు. 


సినిమాల్లో భారతదేశ వైవిధ్యం గురించి నటుడు రానా దగ్గుబాటి మాట్లాడతారు. సినీ పరిశ్రమలో తన 40 ఏళ్ల అనుభవాన్ని పంచుకోనున్నారు నటి, దర్శకురాలు రేవతి. ప్రముఖ రచయిత గురుచరణ్ దాస్, సంగీత దిగ్గజం మహేశ్ రాఘవన్, నందిని శంకర్ సమకాలీన అంశాలపై ప్రసంగిస్తారు.


'తమిళనాడు మోడల్ నుంచి భారత్ ఏం నేర్చుకుంటుంది?' అనే అంశంపై యూత్‌, స్పోర్ట్స్‌ మినిస్టర్ ఉదయనిధి ప్రసంగించనున్నారు. భారతదేశానికి ఫెడరలిజం ఎందుకు అవసరం, రాజకీయాల్లో మహిళల పాత్ర తదితర అంశాలపై కూడా చర్చ నడవనుంది. తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి చెన్నిమలై, నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 


కార్యక్రమం చివర్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల సాధ్యాసాధ్యాలు, బీజేపీని ప్రతిపక్షాలు ఓడించగలవా అనే అంశంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పాల్గొంటారు.