ABP-Cvoter Karnataka Opinion Poll Live Updates: కర్ణాటకలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్, తేల్చి చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP-Cvoter Karnataka Opinion Poll Live Updates: కర్ణాటక ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మే 10న ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి.

ABP Desam Last Updated: 29 Mar 2023 05:50 PM
ఓల్డ్ మైసూర్‌లో కాంగ్రెస్‌కే మొగ్గు

ముంబయి కర్ణాటక, ఓల్డ్‌ మైసూర్‌లోనూ కాంగ్రెస్‌కే మొగ్గు ఎక్కువగా ఉంది. కాంగ్రెస్‌కు 36%, బీజేపీకి 20% మేర ఓట్లు దక్కనున్నట్టు వెల్లడించింది. 

జేడీఎస్‌ పరిస్థితేంటి?

 JDSకి గత ఎన్నికల్లో 18% ఓట్లు సాధించింది. ఈ సారి 17.9% వరకూ సాధించే అవకాశముంది. ఇతర పార్టీలకు 7.3% ఓట్లు దక్కనున్నట్టు అంచనా వేసింది. 

అవినీతి ప్రభావమెంత?

విద్యా వసతుల అంశం 19% మేర ప్రభావం చూపనుంది. శాంతి భద్రతల అంశం 2.9% మేర ప్రభావం చూపనుండగా...అవినీతి నియంత్రణ 12.7% మేర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. 

హైదరాబాద్‌ కర్ణాటకలోనూ కాంగ్రెస్సే

తెలుగు వాళ్లు అధికంగా ఉండే హైదరాబాద్ కర్ణాటకలో...కాంగ్రెస్‌కు 43.7% ఓట్లు దక్కనున్నట్టు అంచనా. ఇక్కడ ఆ పార్టీకి 19-23 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. 

గ్రేటర్ బెంగళూరులో కాంగ్రెస్‌ పైచేయి

అత్యంత కీలకమైన గ్రేటర్ బెంగళూరులోనూ...కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండనున్నట్టు అంచనా. ఇక్కడ కాంగ్రెస్‌కు 38.6% ఓట్లు, 15-19 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే...36.8% ఓట్లు, 11-15 సీట్లు దక్కనున్నాయి. 

కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీకి మొగ్గు

కోస్టల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 41.2% ఓట్లు, 8-12 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇదే ప్రాంతంలో బీజేపీకి 46.2% ఓట్లు, 9-13 సీట్లు రానున్నట్టు తేలింది.

సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా

సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 41.2%,బీజేపీకి 37.7%,జేడీఎస్‌కు 13.1% ఓట్లు దక్కే అవకాశమున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 18-22 సీట్లు, బీజేపీకి 12-16, జేడీఎస్‌కు  ఒక స్థానం దక్కనున్నట్టు అంచనా. 

సిద్దరామయ్యకే మొగ్గు

కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకే శివకుమార్ నిలబడతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ...ABP CVoter Opinion Pollలో మాత్రం అందుకు భిన్నంగా సిద్దరామయ్య పేరే వినబడింది.

సీఎం పని తీరు ఎలా ఉంది?

ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై పని తీరుపై సర్వే చేయగా...26.8% మంది బాగుందని, 26.3% మంది సాధారణంగా ఉందని, 46.9% మంది బాలేదని చెప్పారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పని తీరుపైనా సర్వే జరిగింది. ఇందులో 47.4% మంది బాగుందని, 18.8% మంది సాధారణంగా ఉందని, 33.8% మంది బాలేదని వెల్లడించినట్టు సర్వే తెలిపింది. 

బీజేపీ ప్రోగ్రెస్ రిపోర్ట్

బీజేపీ పనితీరుపై 24,759 మందిపై సర్వే చేయగా...వారిలో 27.7% మంది "బాగుంది" అని, 21.8% మంది "సాధారణం" అని, "బాలేదు" అని 50.5% మంది చెప్పినట్టు  ABP CVoter Opinion Poll వెల్లడించింది. 

హిజాబ్ వివాదం ప్రభావమెంత?

మత విద్వేషాల అంశం 24.6% మేర ప్రభావం చూపనుందని తేలింది. అత్యంత కీలకమైన హిజాబ్ వివాదం 30.8% మేర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. 

నిరుద్యోగం ఎఫెక్ట్ ఎంత?

కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగం కీలకంగా మారనుంది. దాదాపు 29.1% మేర ఎఫెక్ట్ ఈ అంశానిదే ఉండనుందని ABP CVoter Opinion Pollలో తేలింది.

కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు

ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే...కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74,JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బీజేపీకి తగ్గనున్న ఓటు శాతం

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38% ఓట్లు దక్కాయి. ఈ సారి అది 40%కి పెరిగే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ విషయానికొస్తే...గత ఎన్నికల్లో 36% ఓట్లు రాబట్టుకుంది. ఈ సారి 34.7%కే పరిమితమయ్యే అవకాశమున్నట్టు ఒపీనియన్ పోల్‌లో తేలింది.

బీజేపీపై ఓటర్ల అసంతృప్తి

దాదాపు 50% మంది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీపై అసంతృప్తిగా ఉన్నట్టు ABP CVoter సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పనితీరుపైనా 47% మంది అసహనం వ్యక్తం చేశారు. 

Background

కర్ణాటక ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మే 10న ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. 2024 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎలక్షన్స్ కావడం వల్ల కర్ణాటకలో పొలిటికల్ వోల్టేజ్ ఇప్పటికే పెరిగిపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం "బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు" అంటూ ప్రచారం చేస్తోంది. పైగా...ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపై "40% కమిషన్ సీఎం" అంటూ విమర్శలు చేస్తోంది. అందుకే...కర్ణాటక ఎన్నికలపై అందరి దృష్టి పడింది. పైగా...ఇటీవలే రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడమూ కాంగ్రెస్‌కు కొంత వరకూ సానుభూతినిచ్చే అవకాశాలున్నాయి. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని భావిస్తోంది అధిష్ఠానం. తీర్పు రాహుల్‌కు అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా తమకు ప్లస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ABP CVoter Opinion Poll ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. కర్ణాటక ప్రజల పొలిటికల్ మూడ్‌పై సర్వే చేసి కీలక విషయాలు వెల్లడించింది. 


Karnataka Election 2023:


 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర‌ ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 10 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల ఆఖరు తేదీ ఏప్రిల్ 20గా నిర్ణయించిన ఈసీ..21వ తేదీన వాటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 24 ఆఖరి గడువుగా ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీనాటికి 18 ఏళ్లు పూర్తైన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అర్హులేనని వెల్లడించింది. 80 ఏళ్లు దాటిన వారెవరైనా...ఇంటి నుంచే ఓటువేసే అవకాశం కల్పించింది. వోట్‌ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. గిరిజన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. దివ్యాంగులకూ ఇదే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. 2018-19 నుంచి ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. 9.17 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే..ఏడాదిన్నర తరవాత పరిణామాలు మారిపోయాయి. బీజేపీ అధికారంలోకి వచ్చింది. 


కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. 2.59 కోట్ల‌ మంది మహిళా ఓటర్లు కలిపి 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,976 మంది శతాధిక వృద్ధులు, 4,699 మంది థర్డ్ జెండర్లు, 9.17 లక్షల మంది మొద‌టిసారి ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు.


క‌ర్ణాట‌క‌ ఎన్నికల్లో (  Karnataka Election 2023 Date) 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు నాలుగోవంతు ఉన్న‌ 51 రిజర్వ్‌డ్ స్థానాలు  కీలక పాత్ర పోషిస్తాయి. అత్యధిక రిజర్వ్‌డ్ స్థానాలను గెలుచుకున్న పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గ‌త ఎన్నిక‌లు నిరూపించాయి. 51 సీట్లలో 15 షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ), 36 షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వు చేయబడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప‌డిన‌ ప్రతిసారీ, బీజేపీతో పోలిస్తే రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య పరంగా దాని పనితీరు మెరుగ్గా ఉంది. 2008లో య‌డియూరప్ప‌ నేతృత్వంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసిన‌ప్పుడు, 51 రిజ‌ర్వ్‌డ్‌ స్థానాల్లో 29 స్థానాల‌ను ఆ పార్టీ గెలుచుకుంది, కాంగ్రెస్ 17 కైవసం చేసుకుంది. 2013లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ రిజర్వ్‌డ్ స్థానాల్లో 27 గెలుచుకుంది. బీజేపీకి కేవలం ఎనిమిది స్థానాల‌కు మాత్రమే ప‌రిమిత‌మైంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.