Steps to Link Aadhaar on IRCTC : భారతీయ రైల్వే శాఖలో తత్కాల్ టికెట్స్ అనేవి హాట్ కేకుల్లాంటివి. ఇలా బుకింగ్ ఓపెన్ అవ్వగానే అలా టికెట్స్ అమ్ముడుపోతాయి. దీనిలో అక్రమ బుకింగ్లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి.. సామాన్య ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో IRCTC ఓ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. IRCTCలో ఆధార్ను ఏ విధంగా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిబంధన ఇదే..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే IRCTCలో కచ్చితంగా ఆధార్ ఓటీపీతో కూడిన ధృవీకరణ చేయాలని నిబంధనలు ఇచ్చింది. దీని ద్వారా భారతీయ రైల్వేల్లో బల్క్ టికెట్లు, అక్రమబుకింగ్లు తగ్గుతాయని భావిస్తుంది. ఈ నిబంధనతో సామాన్యులకు కూడా తత్కాల్ టికెట్లు దొరుకుతాయని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ జూలై 1, 2025వ తారీఖు నుంచి అమలు కానుంది.
అర్హులు కారు..
మీ IRCTC అకౌంట్ ఆధార్తో లింక్ కాకుంటే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి అర్హులు కారు. కాబట్టి మీరు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా వైరిఫైడ్ యూజర్ అవ్వాల్సిందే. IRCTC వెబ్సైట్లో లేదా IRCTC యాప్లో మీరు కచ్చితంగా యూజర్ అవ్వాలి. మీ మొబైల్ నంబర్ కూడా ఆధార్కి లింకై ఉండాలి. అప్పుడే మీరు ఆధార్ ఓటీపీని టైమ్కి పొందగలుగుతారు.
IRCTCని ఆధార్తో ఎలా లింక్ చేయాలంటే..
ఆధార్ని IRCTCలో లింక్ చేయాలంటే irctc.in వెబ్సైట్లోకి వెళ్లాలి. లేదా IRCTC వెబ్సైట్ అని కొడితే డైరక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు యూజర్ డిటైల్స్తో లాగిన్ అవ్వాలి. అనంతరం My Accountని సెలక్ట్ చేయాలి. అక్కడ Link Aadhaarని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేది వంటి వివరాలు అన్నీ ఇచ్చి.. OTP కోసం Submit చేయాలి. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఆధార్ IRCTCతో లింక్ అయిపోయినట్టే.
పాన్ కార్డ్తో కూడా
మీరు పొరపాటు పేరు, పుట్టిన తేది వంటివి తప్పుగా ఇచ్చినా ఎడిట్ ఆప్షన్తో సెట్ చేసుకోవచ్చు. అయితే ఆధార్లో ఉన్న డిటైల్స్ మాత్రమే ఇవ్వాలని గుర్తించుకోవాలి. పాన్ కార్డ్తో కూడా దీనిని చేయవచ్చు. ఆధార్ లింక్ కోసం ఓపెన్ చేసిన పేజ్లోనే పైన పాన్ కార్డ్ లింక్ కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో అన్ని డిటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
అతి పెద్ద మార్పు ఇదే
మరో అతిపెద్ద మార్పు ఏంటంటే.. ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలనుకుంటే బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత మొదటి 30 నిమిషాల్లో వారికి అనుమతి లభించదు. ఏసీ కోచ్లను ఏజెంట్లు 10 నుంచి 10.30 వరకు బుక్ చేయలేరు. నాన్ ఏసీ కోచ్లు 11 నుంచి 11.30 వరకు ఏజెంట్లు బుక్ చేసే వీలు ఉండదు. కాబట్టి రెగ్యులర్ పాసింజర్లు టికెట్లు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.