విమానాల్లో ఈ మధ్య కాలంలో వింత వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి అబుదాబి నుంచి ముంబై వచ్చే ఎయిర్ విస్తారా విమానంలో హై వోల్టేజ్ డ్రామా జరిగింది. ఇటలీకి చెందిన ఓ మహిళ మొదట విమానంలోని సిబ్బందిని దూషించడం ప్రారంభించారు, ఆపై వారిపై దాడి చేశారు. తర్వాత రచ్చ రచ్చ చేశారు. 


వాస్తవానికి ఎకానమీ క్లాస్ టికెట్ తో విమానం ఎక్కిన ఆ మహిళ బిజినెస్ క్లాస్ లో కూర్చోవాలని పట్టుబట్టారు. క్యాబిన్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె హంగామా సృష్టించారు. దీంతో ఇటలీకి చెందిన పావోలా పెరూసియో (45) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.


బిజినెస్ క్లాసులో కూర్చోవడంపై దుమారం


ఎయిర్ విస్తారా విమానం యూకే 256 క్యాబిన్ సిబ్బంది నుంచి తమకు సోమవారం ఫిర్యాదు అందిందని సహర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. అదే రోజు తెల్లవారుజామున 2.03 గంటలకు అబుదాబి నుంచి విమానం బయలుదేరింది. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఎకానమీ క్లాస్ లో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా లేచి పరిగెత్తి బిజినెస్ క్లాస్ లో కూర్చుంది. ఇద్దరు క్యాబిన్ క్రూ మెంబర్స్ మొదట వెళ్లి మహిళతో మాట్లాడారు. ఆమెకు ఎలాంటి సమస్య లేదని గుర్తించిన సిబ్బంది తిరిగి వెళ్లిన తన సీటులో కూర్చోవాలని చెప్పారు. 



సిబ్బంది ముఖంపై పంచ్


అలా సిబ్బంది చెబుతుండగానే సదరు మహిళ దూషించడం ప్రారంభించింది. తప్పుడు పదజాలం వాడొద్దని మహిళను అక్కడి సిబ్బంది రిక్వస్ట్ చేశారు. అంతే ఆ మహిళ సిబ్బందిలో ఒకరి ముఖంపై పంచ్‌ చేసింది. మరొకరిపై ఉమ్మివేసింది. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో మరికొంతమంది సిబ్బంది అక్కడకు వచ్చారు. 


మిగతా సిబ్బంది రావడంతో ఆ మహిళ బట్టలు విప్పేసి విమానం కారిడార్ లో నడవడం ప్రారంభించింది. చాలా సేపు గొడవ తర్వాత మహిళను అదుపులోకి తీసుకొచ్చారు. సాయంత్రం 4.53 గంటలకు విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే మహిళా ప్రయాణికురాలిని విస్తారా సెక్యూరిటీ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సహర్ పోలీసులకు అప్పగించారు.


గతంలో పల్లె వెలుగు బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకున్నట్లుగానే విమానాల్లో కూడా కొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు మనం తరచుగా చూస్తున్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఎయిర్ ఇండియా న్యూయార్క్- ఢిల్లీ విమానంలో వృద్ధ మహిళా ప్రయాణీకురాలి సీటుపై మూత్రం పోశాడో వ్యక్తి. దీనిపై కేసు నమోదైంది. ఆ మూత్రం పోసిన వ్యక్తి అరెస్టు కూడా అయ్యాడు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు గొడవ పడిన ఘటన ఈ మధ్య తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ముందుగా గొడవ పడ్డ యువకుడు ఆ తర్వాత తన ఒంటిపైనున్న చొక్కాను విప్పి మరీ తోటి ప్రయాణికుడిపై గుద్దుల వర్షం కురిపించాడు. అయితే విమానంలో జరిగిన వాగ్వాదాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.