Girl Died In Sabarimala: శబరిమలలో విషాద ఘటన జరిగింది. అయ్యప్ప స్వామి దర్శానికి వెళ్లి తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలిక శనివారం మృతి చెందింది. కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న బాలిక ఇటీవల స్వామి దర్శనం కోసం వెళ్లింది. సుదీర్ఘ సమయం పాటు యాత్రికుల రద్దీ మధ్య క్యూలో కుప్పకూలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  


శబరిమల ఆలయానికి ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. యాత్రికులు స్వామి దర్శానానికి 18 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది భక్తులు స్వామి వారిని వేగంగా దర్శించుకోవడం కోసం క్యూలైన్లలో ఏర్పాుట చేసిన బారికేడ్లను దూకడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. భక్తుల మధ్య తోపులాట జరిగింది. పెరుగుతున్న రద్దీ, ఆందోళనలపై స్పందించిన కేరళ దేవదాయశాఖ మంత్రి రాధాకృష్ణన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు సీఎస్ ప్రశాంత్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 10,000 తగ్గించారు. అంతకు ముందు రోజుకు 90,000 వేలు ఉండగా దానిని 80,000కు కుదించారు. భక్తులకు భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సన్నిధానం వద్ద ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల మధ్య ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణ వైద్య సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.


దర్శన సమయం పెంపు
శబరిమలలోని అయ్యప్ప క్షేత్రానికి భక్తుల రద్దీ పెరగడంతో దర్శన సమయాలను గంటపాటు పెంచుతూ ట్రావెన్‌కోర్ ఆదివారం నిర్ణయం తీసుకుంది. మాములూగా రెండో దర్శన సమయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. దానిని మధ్యాహ్నం 3 నుంచి 11 గంటల వరకు సవరించాలని బోర్డు నిర్ణయించినట్లు జిల్లా పరిపాలన అధికారి తెలిపారు. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నట్లు అధికారి తెలిపారు.


ప్రతిపక్షాల ఫైర్
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు సరిగా లేవని, భక్తులు దర్శనం కోసం 15 నుంచి 20 గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. భక్తులకు నీరు కూడా అందించడం లేదని ఆరోపించారు. భక్తులకు సహాయం చేయడానికి శబరిమల వద్ద తగినంత మంది పోలీసులను మోహరించడం లేదని, యాత్రికుల ఏర్పాట్లకు సంబంధించి కేరళ హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదన్నారు.


అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో లేవని సతీషన్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోకుంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. దర్శనం కోసం 10-12 గంటలకు పైగా క్యూలైన్లలో నిల్చున్నట్లు పలువురు భక్తులు టీవీ ఛానళ్లలో ఫిర్యాదు చేయడం కనిపించింది. శబరిమలకు వెళ్లే మార్గంలో కూడా యాత్రికులు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నారు. 


శబరిమల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఐజీ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ.. రోజుకు 75,000 మంది భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని ట్రావెన్స్ కోర్ దేవస్థానం బోర్డును అభ్యర్థించారు. ప్రస్తుత మూడవ దశ తీర్థయాత్రలో ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా 90,000 బుకింగ్‌లు, స్పాట్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తుల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. ఈసారి ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని, ఇవి భక్తులను పతినెట్టంపాడి (18 దైవిక మెట్లు) త్వరగా అధిరోహించే ప్రయత్నాలను ప్రభావితం చేశాయని అధికారి తెలిపారు.