India First Voter Dies:


అధికారికంగా దహన సంస్కారాలు..


స్వతంత్ర భారతంలో తొలి ఓటర్‌గా గుర్తింపు పొందిన శ్యాం శరణ్ నేగి (Shyam Saran Negi) కన్నుమూశారు. 106 ఏళ్ల శ్యామ్ శరణ్...హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో తుది శ్వాస విడిచారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటు కూడా వేశారు. నవంబర్ 2వ తేదీన ఆయన ఓటు వేయగా...రెండ్రోజుల తరవాత మృతి చెందారు. నిజానికి తన జీవిత కాలంలో దాదాపు 35 సార్లు పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటు వేశారు శ్యాం శరణ్ నేగి. ఈ సారి మాత్రం..పోస్టల్ బ్యాలెట్‌కు పరిమితమయ్యారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు వెంటాడు తున్నాయి. తన సొంత గ్రామమైన కల్పాలో ప్రభుత్వ సత్కారాలతో అధికారికంగా ఆయన దహన సంస్కారాలు జరుగుతాయని కిన్నౌర్ డిప్యుటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ వెల్లడించారు. హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్...శ్యాం శరమ్ మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు. "శ్యాం శరణ్ నేగి గారు లేరన్న వార్త నన్నెంతో కలిచివేస్తోంది. కిన్నౌర్‌కు చెందిన ఆయన స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్" అని ట్వీట్ చేశారు. 






ఈ విషయాలు తెలుసా..? 


1.1917లో జులై 1న జన్మించిన శ్యాం శరణ్ నేగి, స్కూల్ టీచర్‌గా 1975లో రిటైర్ అయ్యారు. 
2.1951లో పోలింగ్ టీమ్‌ సభ్యుడిగా పని చేశారు శ్యాం శరణ్. షాంతాంగ్ పోలింగ్ స్టేషన్‌లో తాను తొలిసార ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎప్పుడూ గుర్తు చేసే వారు. దాదాపు 10 రోజుల పాటు ట్రెకింగ్ చేసి మరీ ఓటు వేసే వాడినని సన్నిహితులకు చెబుతుండే వారు. 
3. ఎన్నికల ప్రక్రియల్లో వచ్చిన అన్ని మార్పులనూ చాలా దగ్గర నుంచి గమనించారు శ్యాం శరణ్. బ్యాలెట్ పేపర్‌పై స్టాంప్‌లు వేసినప్పటి నుంచి EVM,VVPATలు అందుబాటులోకి వచ్చేంత వరకూ అన్ని విధానాల్లోనూ ఓటు వేశారు. ఎప్పుడూ కూడా ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేయలేదు. 
4. పంచాయత్, అసెంబ్లీ, పార్లమెంట్..ఇలా ఏ ఎన్నిక జరిగినా ఎప్పుడూ మిస్ అవకుండా ఓటు వేసేవారు శ్యాం శరణ్. 
5. మరో విశేషం ఏంటంటే..2014లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం ఆయను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని కోరింది. 
6. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో Google ఆయనపై ఓ వీడియో క్రియేట్ చేసింది. #PledgeToVote క్యాంపెయిన్‌లో భాగంగా ఈ వీడియో విడుదల చేయగా...ప్రపంచమంతా ఆయన పేరు మారు మోగింది. 
7. ప్రతి ఒక్క ఓటు విలువైనదే అంటూ యువతకు ఎప్పుడూ చెబుతుండే వారు శ్యాం శరణ్ నేగి. చనిపోయే ముందు కూడా ఇదే సందేశమిచ్చారు. 
8. ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం చేస్తే గానీ భారత్‌కు స్వాతంత్య్రం లభించలేదని, ఎన్నికలను పండుగలా చూడాలని సూచించే వారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే మంచి నాయకులను ఎన్నుకునే అవకాశముంటుందని చెబుతుండే వారు. 


Also Read: Elon Musk Twitter: ట్విటర్ కథను మలుపు తిప్పిన "ఏడు రోజులు", ఇంకేం మార్పులు చూడాలో?