India-China LAC Clash:



గమనిస్తున్న అమెరికా..


భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో ఇంకా అలజడి కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇటు భారత్ మాత్రం యుద్ధ వాతావరణమే వస్తే దీటుగా బదులిస్తామని గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలోనే యూఎస్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌ కీలకంగా మారింది. భారత్, చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. Annual Threat Assessment పేరిట ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది అమెరికా జాతీయ నిఘా విభాగం. ఆ రెండు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించింది. 


"భారత్, చైనా మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ 2020లో జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని నిశితంగా గమనిస్తున్నాం. అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య ఏ కాస్త పరిస్థితులు అదుపు తప్పినా అది అమెరికాకు కూడా చేటు చేస్తుంది. అలాంటి  సమయంలో అమెరికా జోక్యం చేసుకోక తప్పదు. క్రమంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ముదిరేలా కనిపిస్తోంది"


- అమెరికా నిఘా విభాగం
 
పాకిస్థాన్‌పై వ్యాఖ్యలు..


అమెరికా తమ ప్రజల్ని కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిస్తుందని ఈ రిపోర్ట్‌లో తేల్చి చెప్పింది ఇంటిలిజెన్స్. అటు భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాన్నీ ప్రస్తావించింది. కశ్మీర్‌లో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ సంక్షోభం ఇంకా ముదిరే అవకాశముందని అంచనా వేసింది. అయితే..యాంటీ ఇండియా మిలిటరీ గ్రూప్స్‌కు పాకిస్థాన్‌ మద్దతునిస్తోందని, కానీ మోదీ పాలనలో ఎలాంటి దాడులకు పాల్పడాలని చూసినా...ఎదురు దాడులు తప్పవని స్పష్టం చేసింది. 


"యాంటీ ఇండియా మిలటరీ గ్రూప్స్‌కు మద్దతుగా ఉండే చరిత్ర పాకిస్థాన్‌ది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మాత్రం భారత్‌ గతంలోలా లేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా వెంటనే మిలిటరీతో గట్టి బదులు ఇస్తుంది. కానీ కశ్మీర్‌లో మరోసారి అశాంతి చెలరేగే ప్రమాదముంది"


- అమెరికా నిఘా విభాగం


స్పై బెలూన్స్‌ కలకలం..


అమెరికా ఎయిర్‌ బేస్‌లో అనుమానాస్పద వస్తువులు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా వాటిని పేల్చేస్తోంది అగ్రరాజ్యం. ఇది కచ్చితంగా చైనా పనే అని తేల్చి చెబుతోంది. నిఘా పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండి పడుతోంది. ఈ ఆరోపణలపై స్పందించిన డ్రాగన్..కౌంటర్ ఇచ్చింది. అమెరికా తమ ఎయిర్‌బేస్‌లోకి స్పై బెలూన్‌లు పంపుతోందని ఆరోపించింది. జనవరి నుంచి ఇప్పటి వరకూ 10 బెలూన్స్‌ను గుర్తించామని వెల్లడించింది. అమెరికా అక్రమంగా తమ ఎయిర్‌బేస్‌లోకి బెలూన్‌లు పంపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నుంచే ఈ నిఘా మొదలైందని...ఇప్పటి వరకూ 10 కన్నా ఎక్కువగా స్బై బెలూన్‌లు పంపిందని చెప్పింది. చైనా అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇప్పటికే అమెరికా-చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. నిత్యం ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి ఇరు దేశాలు. అగ్రరాజ్యం అనే  బిరుదు కోసం చైనా తపిస్తోంది. అమెరికాను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. 


Also Read: Delhi Excise Policy Case: తీహార్‌ జైలుకు ఈడీ అధికారులు, సిసోడియాపై ప్రశ్నల వర్షం!