India Canda Tension: 



ముదురుతున్న వివాదం..


భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అల్లర్ల వెనక పాకిస్థాన్ హస్తం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిఘా వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. కెనడాలో పాకిస్థాన్‌కి చెందిన ISIతో పాటు ఆ దేశ నిఘా వర్గం కూడా ఉందని...ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నాయని సమాచారం. ఓ చోట రహస్యంగా ఖలిస్థాన్ టెర్రర్ గ్రూప్‌ల చీఫ్‌లతో భేటీ అయినట్టు తెలుస్తోంది. Sikhs for Justice (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ కూడా ఈ మీటింగ్‌కి హాజరయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు మరి కొందరు కీలక నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే...5 రోజుల క్రితమే ఈ రహస్య సమావేశం జరిగింది. ISI ఏజెంట్స్, ఖలిస్థాన్‌ గ్రూప్‌ల భేటీ అజెండా కూడా తెలిసింది. వీలైనంత వరకూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికే Plan-K అని పేరు కూడా పెట్టుకున్నట్టు సమాచారం. ఇంకా కీలక విషయం ఏంటంటే..కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థలకు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తోంది ISI.కొద్ది నెలలుగా భారీగానే నిధులు అందినట్టు సమాచారం. భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి వ్యక్తుల్ని నియమించుకోవడం కోసం...పోస్టర్లు బ్యానర్లు తయారు చేసుకోడానికి ఈ నిధులు వాడుతున్నారు. భారత్ కెనడా మధ్య మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో ISI,ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు భేటీ అవడం ఆందోళన కలిగిస్తోంది. 


20 మంది వేర్పాటువాదులు..!


కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటు వాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనకాల భారత్ ఉందని ఇప్పటికే ఆ దేశ ప్రధాని ట్రూడో ఆరోపించారు. దీనిపై భారత్ గట్టిగానే స్పందించింది. అనవసరపు వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. ఈ వివాదాన్ని పరిష్కరించాలని ట్రూడో అమెరికా సాయం కూడా అడిగారు. కానీ ఇప్పటి వరకూ అగ్రరాజ్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతానికి కెనడాలో  20 మంది ఖలిస్థానీ వేర్పాటువాదులు, గ్యాంగ్‌స్టర్స్‌ ఉన్నట్టు సమాచారం. దీనిపై విచారణ చేపట్టేందుకు NIA గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ కెనడా మాత్రం అందుకు సహకరించడం లేదు. ఇండియా మాత్రం ఇప్పటికే 9 మంది ఖలిస్థాన్ టెర్రరిస్ట్‌లను గుర్తించి ఆ లిస్ట్‌ని కెనడాకు పంపింది. వీళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పంజాబ్‌ సహా భారత్‌లోని పలు చోట్ల అల్లర్లు సృష్టించే అవకాశముందని వెల్లడించింది. కానీ కెనడా ఈ విషయంలో భారత్‌కి సపోర్ట్ ఇవ్వడం లేదు. 


కెనడాలో ఖలిస్థానీ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే భారత్, కెనడా మధ్య ఈ విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఖలిస్థాన్ వేర్పాటువాద సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై చర్చించారు. ఈ క్రమంలోనే ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ Sikhs for Justice (SFJ) కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చింది. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. SFJ లీగల్ కౌన్సిల్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ (Gurpatwant Singh Pannun) ఈ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హిందువులందరూ వెంటనే కెనడా విడిచి వెళ్లిపోవాలని బెదిరించాడు. 


Also Read: కెనడాలో భారత వీసా సర్వీస్‌లపై ఆంక్షలు, వీసా అప్లికేషన్ సెంటర్ అధికారిక ప్రకటన