తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకమైన స్థానాల్లో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ పరిధిలోని సీపీలను మార్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఆయా శాఖల్లో ఉన్న అధికారులను బదిలీ చేయడంతోపాటు కొత్త వారిని నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 


ముఖ్యంగా విద్యుత్‌ శాఖను ప్రాధాన్యత క్రమంలో తీసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత విద్యుత్ సంస్థల బాధ్యతలను ఐఏఎస్‌లకు అప్పగించింది. ఇప్పటి వరకు ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారులకు ఉద్వాసన పలికారు. వారి స్థానంలో యంగ్‌ ఆఫీసర్స్‌ను నియమించారు. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు విద్యుత్ సంస్థలకు సివిల్ సర్వీస్ అధికారులే సీఎండీలుగా ఉండే వాళ్లు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లెక్కలు మారిపోయాయి. విద్యుత్‌ సంస్థల్లో పని చేసిన ఆఖరి అధికారి రిజ్వీ. ఆయన ఓ డిస్కం డైరెక్టర్‌ను నిలదీయడంతో ఆయనపై బదిలీవేటు పడింది. అప్పటి నుంచి బయట వ్యక్తులే విద్యుత్ సంస్థల సీఎండీలుగా ఉంటూ వచ్చారు. 


కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్‌ సంస్థలు, సరఫరా విషయంలో సీరిసయస్‌గా దృష్టి పెట్టింది. అందుకే విద్యుత్ సరఫరాల, పంపిణీతోపాటు ఇతర సంస్థల బాధ్యతలను ఐఏఎస్‌లకు అప్పగించింది. ఇంధన శాఖ కార్యదర్శితోపాటు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీని తీసుకొచ్చింది ప్రభుత్వం. 1990 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి గతంలోనూ ట్రాన్స్‌కో సీఎండీగా పని చేశారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న  రిజ్వీ సీఎండీగా ఉన్న టైంలో అధికారులను పరుగులు పెట్టించారు. ఓ డిస్కం డైరెక్టర్‌ను ప్రశ్నించడంతో ఆయనపై ఒత్తిడి వచ్చింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు. తర్వాత ఆయన్ని ప్రభుత్వం వేరే శాఖకు బదిలీ చేసింది. ఆయన తర్వాత ఆ బాధ్యతలను బయట వ్యక్తులను నియమిస్తూ వచ్చారు. ఇప్పుడు రిజ్వీకి ఉన్న అనుభవం ఆయన స్టడీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సందీప్‌కుమార్‌ ఝాను నియమించింది ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న సీ శ్రీనివాస్‌రావు స్థానంలో 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. గతంలో ఆయన డిప్యుటేషన్‌పై ఇక్కడ పని చేశారు. డిప్యుటేష్ ముగిసినా కూడా కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లకుండా వీఆర్‌ఎస్‌ తీసుకొని మరీ జేఎండీగా ఉంటూ వచ్చారు. ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీగా 2014 బ్యాచ్‌కు చెందిన ముషారఫ్‌ అలీ ఫారుఖీని ఎంపిక చేశారు. 2019 బ్యాచ్‌కు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డిని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీగా ప్రభుత్వం నియమించింది. 
తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన మరో శాఖ ఐటీ. దీనిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణకు ఆయువుపట్టు అయిన ఐటీని మరింతగా అభివృద్ధి చేసేలా ఉన్న కంపెనీలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈ శాఖ బాధ్యతలను యంగ్‌ ఐఏఎస్‌కు అప్పగించారు. 


పర్యాటక శాఖలో పని చేస్తున్న శైలజారామయ్యకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది ప్రభుత్వం. కేంద్ర సర్వీస్‌ నుంచి తిరిగి వచ్చిన ఆమ్రపాలిని హెచ్‌ఎండీసీ జాయింట్‌ కమిషనర్‌గా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న గోపిని వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.