Honey Trap: పాకిస్థాన్ ఎప్పటిలాగానే తన కపట బుద్ధిని ప్రదర్శిస్తోంది. భారత అంతర్గత వ్యవాహారాలు తెలుసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా అమ్మాయిలతో వలపు వల విసిరిస్తూ.. వాళ్లకు కావాల్సిన సమాచారాన్ని చేజిక్కించుకుంటోంది. అయితే తాజాగా పాక్ హనీ ట్రాప్ లో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. అనుమానం వచ్చిన అధికారులు అతని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పని చేస్తున్నారు. అంతకుముందు అతను రక్షణ రంగంలో కీలకమైన భారత డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించేవాడు. దీంతో అతని నుంచి కీలక సమాచారం తెలుసుకునే క్రమంలో పాకిస్థాన్ అతడిపై వలపు వల విసిరింది. ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన పెద్ద నాయకుడి పీఏ కి తమిషా అనే పాకిస్థాన్ యువతితో పరిచయం ఉంది. ఆ యువతితో సోషల్ మీడియా ద్వారా కపిల్ తో పరిచయం పెంచుకుంది. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది. న్యూడ్ వీడియో కాల్స్ తో మొదలైన ఈ స్నేహం.. రహస్యంగా ఓ గదిలో కలిసేంత వరకు వచ్చింది. ఇలా కొంతకాలంగా కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


కాగా కపిల్ కుమార్ ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి బదిలీ అయి విశాఖలో పని చేస్తున్నాడు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కపిల్ కుమార్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది. తదుపతి విచారమ కోరుతూ... స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇంఛార్జీ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశం అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వవిధ ఏజెన్సీలు దర్యాప్తులోకి దిగాయి.