​Himachal Tragic Accident:


హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో దారుణం జరిగింది. మురికివాడలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం వల్ల నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ నలుగురూ బిహార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయని, ఆ సమయంలో అక్కడే నిద్రిస్తున్న చిన్నారులు అక్కడికక్కడే దహనమయ్యారని తెలిపారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పారు. చిన్నారులను మంటల్లో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ..అప్పటికే వాళ్లు చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇప్పటి వరకూ తేలలేదు. ప్రస్తుతానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.