HP BJP Candidates List:


అభ్యర్థుల జాబితా వచ్చేసింది..


హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల తేదీని ఈ మధ్యే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతకు ముందే ఎన్నికల హడావుడి మొదలు కాగా... ఇప్పుడది ఇంకాస్త పెరిగింది. పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నాయి. అధికార భాజపా ఈ విషయంలో ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 62 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సీఎం జైరామ్ ఠాకూర్మండి జిల్లాలోని సెరాజ్ (Seraj) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మండి నియోజకవర్గం నుంచి అనిల్ శర్మ, ఉనా నియోజకవర్గం నుంచి సత్పాల్ సింగ్ బరిలోకి దిగనున్నారు. సీఎం ఠాకూర్ ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నవంబర్ 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏడోసారి పోటీ చేయనున్నారు. అటు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొదటి విడతలో 46 మంది అభ్యర్థులను ప్రకటించింది. లెజిస్లేచర్ పార్టీ లీడర్ ముఖేశ్ అగ్నిహోత్రిని ఉనా జిల్లాలోని హరోలి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనుంది. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సుఖ్వీందర్ సింగ్ సుకు, కుల్‌దీప్ సింగ్...నందున్, తెయోగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకేఅవకాశమిచ్చింది కాంగ్రెస్. 






నవంబర్ 12న పోలింగ్..


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. 2017లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 44 చోట్ల భాజపా గెలిచింది. దీంతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ కేవలం 21 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో జై రామ్ ఠాకూర్‌ను పార్టీ అధిష్ఠానం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది.


సర్వే..


హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇటీవల ABP News,C Voter ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ABP News- C Voter Opinion Poll 2022 ప్రకారం...2017తో పోల్చి చూస్తే హిమాచల్‌లో భాజపా ఓటు షేర్ కాస్త తగ్గనుంది. ఈ ఏడాది ఓటు షేర్ 45.2%గా ఉండగా 2017లో ఇది 48.8%గా నమోదైంది. ఇక మిగతా పార్టీల సంగతి చూస్తే కాంగ్రెస్‌ ఓటు శాతం 33.9%గా అంచనా వేసింది. గత ఎన్నికలతో పోల్చితే ఇది 8% తక్కువ. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఓట్ షేర్ 9.5%గా నమోదవుతుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం భాజపానే మరోసారి అధికారంలోకి రానుంది. కాషాయ పార్టీ 37-45 సీట్లు సాధిస్తుందని ABP-C Voter సర్వే స్పష్టం చేసింది. 


Also Read: TRS As BRS : బీఆర్ఎస్‌గా మారాలంటే మూడు నెలలు ఆగాల్సిందే - కేసీఆర్‌కు ఏదీ కలసి రావడం లేదా ?