ఈ దశాబ్దంలో మొదటి ఏడాదైన 2021 ఎన్నో జ్ఞాపకాలను పంచి వెళ్లిపోతోంది. ఇప్పటివరకు చూడని ఎన్నో సంఘటనలు ఈ ఏడాది మనం చూశాం. అవన్నీ ఈ ఏడాదే తొలిసారి జరగడం విశేషం. అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఈ ఏడాదే వచ్చారు. నలుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. ఇలా ఎన్నో అరుదైన ఘటనలు ఈ ఏడాది జరిగాయి. అవేంటో చూద్దాం.







1. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు 



భారత సంతతికి చెందిన కమాలా హారిస్ అమెరికా చరిత్రలోనే తొలిసారి ఓ మహిళా దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆమె గంట 25 నిమిషాల పాటు దేశ అధ్యక్షురాలిగా కూడా ఈ ఏడాది పని చేశారు. ఆమె 49వ అమెరికా ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్ అమెరికా మొదటి రెండో జంటిలిమెన్‌ అయ్యారు.


2. అంతరిక్ష పర్యటన 


పరిశోధన కోసం కాకుండా పర్యటన నిమిత్తం మనుషులు ఈ ఏడాది అంతరిక్షంలో అడుగుపెట్టారు. బిలియనీర్ జెఫ్ బెజోస్ ఈ యాత్ర చేపట్టారు. అంతరిక్షయానంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రికార్డ్ సృష్టించారు. జెఫ్‌ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో కూడిన 'న్యూ షెపర్డ్‌' ప్రయోగం విజయవంతమైంది. నలుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్‌ అధినేత స్వీయ సంస్థ 'బ్లూ ఆరిజిన్‌' ఈ యాత్రను చేపట్టింది.


3. ఒలింపిక్స్‌లో కొత్త ఆటలు 


ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ 2020లో కొత్తగా ఐదు ఆటలను ప్రవేశపెట్టారు. సాఫ్ట్/బేస్ బాల్, కరాటే, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్ ఆటలను ఈ ఏడాది నుంచి కొత్తగా చేర్చారు. 2020లో జరగాల్సిన ఈ టోక్యో ఒలింపిక్స్ కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.


4. తొలిసారి ఎక్స్ జెండర్ పాస్‌పోర్ట్ 


అమెరికా చరిత్రలోనే తొలిసారి ఎక్స్ జెండర్ హోదా కలిగిన ఒక కొత్త తరహా పాస్ పోర్టును జారీ చేసింది. జెండర్ హక్కుల కార్యకర్తలు సాధించిన విజయంగా దీన్ని చెప్పాలి. యూఎస్‌ మాజీ నేవీ అధికారి ఈ పాస్‌పోర్ట్‌ను తొలిసారి పొందారు. పురుషులు లేదా మహిళలుగా గుర్తించని వారికి ఈ ఎక్స్ జెండర్ పాస్‌పోర్ట్ ఇస్తోంది అమెరికా.


5. అమెరికాకు తొలి నల్లజాతి రక్షణ మంత్రి 


అమెరికా రక్షణ మంత్రిగా తొలిసారి ఓ నల్లజాతీయుడికి అవకాశం దక్కింది. లాయిడ్ ఆస్టిన్ ఈ బాధ్యతలు చేపట్టారు. అమెరికా ఆర్మీలో 41 ఏళ్ల పాటు ఆయన సేవలు అందించారు.


6. ఆచరణలోకి అద్భుత లోకం 


మెటావర్స్ అనే అధునాతన సాంకేతికత ఈ ఏడాది కార్యరూపం దాల్చింది. ఇప్పటివరకు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయిన మనుషులకు వర్చువల్ వరల్డ్​ను పరిచయం చేస్తుందీ మెటావర్స్. డిజిటల్ పరికరాల తెరలను చూడటానికే పరిమితమైన మనల్ని అవధుల్లేని అంతర్జాల లోకంలో విహరించే వీలు కల్పిస్తుంది.


ఈ సాంకేతికత సాయంతో దూరంగా ఉన్నవాళ్లు ఒకరినొకరు వర్చువల్​గానే కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్​గా, రియల్​టైమ్​లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. వర్చువల్ రియాలిటీ హెడ్​సెట్​లు, అగ్​మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు, స్మార్ట్​ఫోన్ యాప్​లు, ఇతర పరికరాల సాయంతో ఈ మెటాఫోర్​ను అభివృద్ధి చేయనున్నారు.


ఇందుకోసం ఫేస్​బుక్ అధినేత మార్క్ జుకర్​బర్గ్ 50 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వేలాది మందిని ఈ పని కోసం నియమించుకున్నారు. ఐరోపాలో ఫేస్​బుక్ తరఫున ఈ ఇంజినీర్లంతా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందుకోసమే తన కంపెనీ పేరును కూడా 'మెటా'గా మార్చుకున్నారు జుకర్‌బర్గ్.


7. తొలి ఎన్‌ఎఫ్‌టీ అమ్మకం 


నాన్​ ఫంగిబుల్​ టోకెన్స్​ (ఎన్​ఎఫ్​టీ) అంటే ఒక్క మాటలో డిజిటల్​ ఆస్తులు అని చెప్పొచ్చు. డిజిటల్​ మాధ్యమంలో సృష్టించిన ట్వీట్​, చిత్రం, వీడియో లాంటి సృజనను సదరు రూపకర్త అమ్మకానికి ఉంచొచ్చు. లండన్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 11న డిజిటల్ ఆర్ట్‌వర్క్ క్రిప్టో పంక్ 11.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.  2017లో లార్వా ల్యాబ్స్‌ తయారు చేసిన 10వేల పిక్సల్ ఆర్ట్ క్యారెక్టర్లే ఈ క్రిప్టోపంక్.


8. గ్రీన్ ల్యాండ్ వర్షం


చరిత్రలో తొలిసారిగా గ్రీన్ ల్యాండ్‌లోని అత్యధిక పాయింట్ వద్ద మంచు పడకుండా వర్షం పడింది.మంచు పలక మీద అంటే 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో చాలా గంటలు వర్షం పడింది.  నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ ప్రకారం, గ్రీన్ ల్యాండ్ గత 14 నుంచి 16 ఆగస్టులలో భారీ వర్షం కురిసింది. భూతాపం వల్ల ఇలా జరిగినట్లు శాస్త్రవేత్తలు నిర్ధరించారు. 


9. సూర్యుని వాతావరణంలోకి  


అంతరిక్ష చరిత్రలో మరో అపూర్వ ఘట్టం ఈ ఏడాది ఆవిషృతమైంది. సూర్యుని వాతావరణమైన కరోనాలోకి వ్యోమనౌక ప్రవేశించింది. నాసా ప్రయోగించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' స్పేస్​క్రాఫ్ట్ ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని అమెరికా జియోఫిజికల్ యూనియన్ సమావేశంలో శాస్త్రవేత్తలు ప్రకటించారు.


10. అధికారిక కరెన్సీగా బిట్‌కాయిన్‌   


సెంట్రల్​ అమెరికా దేశమైన ఎల్​ సాల్వడార్ ఈ ఏడాది సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్​కాయిన్​ వినియోగాన్ని తమ దేశంలో అధికారికం చేసినట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే క్రిప్టోకరెన్సీని లీగలైజ్ చేసిన తొలి దేశంగా సాల్వడార్ నిలిచింది.


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్


Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి