Gen Bipin Rawat Last Rites LIVE: వీడ్కోలు వీరుడా.. ముగిసిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
సీడీఎస్ బిపిన్ రావత్ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాజకీయ, సైనిక రంగానికి చెందిన ఎంతోమంది ఆయనకు పుష్పాంజలి ఘటిస్తున్నారు.
సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్కు వీడ్కోలు పలికారు. భారతమాత ముద్దు బిడ్డకు యావత్ దేశం నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికులు పాల్గొన్నారు.
బిపిన్ రావత్ అంతిమయాత్ర కొనసాగుతోంది. ప్రజలంతా రహదారికి ఇరు వైపులా జాతీయం జెండాలతో నిల్చొని బిపిన్ రావత్ గురించి నినాదాలు చేస్తున్నారు.
సీడీఎస్ బిపిన్ రావత్ అంతిమయాత్ర మొదలైంది. కామరాజ్ మూడవ నంబర్ బంగ్లా నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. సైనిక లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
తమ తల్లిదండ్రులకు నివాళులర్పించారు బిపిన్ రావత్ కుమార్తెలు క్రితికా, తరిణి. బిపిన్ రావత్ దంపతుల పార్థివదేహాలను చూసిన కన్నీటిపర్యంతమయ్యారు.
సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు.
Background
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో కాసేపట్లో జరగనున్నాయి. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించారు.
రావత్ దంపతుల భౌతికకాయాలకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పించనున్నారు. తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి దిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖుల నివాళి..
తమిళనాడు కూనూర్లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్తో పాటు 11 మంది సైనికుల పార్థివదేహాలను దిల్లీలోని పాలం ఎయిర్బేస్కు తీసుకువచ్చారు. ఎయిర్బేస్కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరుల భౌతికకాయాలకు నివాళులర్పించారు.
అంతకు ముందు ఎయిర్బేస్కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పార్థివ దేహాలకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. అమరుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -