kendra sahitya akademi award 2023:



కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం..


ప్రముఖ తెలుగు రచయిత తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డు ప్రకటించింది అకాడమీ. మొత్తం 24 భాషలకు చెందిన రచయితలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ...తెలుగులో పతంజలి శాస్త్రికి కట్టబెట్టింది. రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు పుస్తకాన్ని ఈ అవార్డు వరించింది. కథలే కాకుండా నవలా రచయిత గానూ వాసికెక్కారు పతంజలి శాస్త్రి. 1945లో పిఠాపురంలో జన్మించిన పతంజలి ఒంగోలులో విద్యనభ్యసించారు. తిరుపతి,  పుణెల్లోనూ చదివారు. పుణేలోని దక్కన్ కాలేజీ నుంచి ఆర్కియాలజీలో డాక్టరేట్ అందుకున్నారు. లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా పని చేసిన ఆయన...పతంజలి శాస్త్రి కథలు, వడ్ల చిలుకలు లాంటి కథా సంపుటాలు వెలువరించారు. 1961 నుంచే ఆయన రచనా ప్రస్థానం మొదలైంది. సాధారణంగా ఎవరైనా కవిత్వంతో ప్రారంభించి కథలు, నవలలు రాస్తారు. కానీ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి మాత్రం తన రచనా ప్రస్థానాన్ని కథలతోనే మొదలు పెట్టారు. ఆ తరవాత కవిత్వం, నాటకాలు, నవలలు రాశారు. గాథా సప్తశతిలోని 100 కథల్ని అడవి పూలు పేరుతో తెలుగులోకి అనువదించారు.