Cheistha Kochhar Dead: లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి చెందారు. గతంలో నీతి ఆయోగ్‌లో పని చేసిన చేష్టా కొచ్చర్ (Cheistha Kochhar) సైక్లింగ్ చేస్తుండగా ట్రక్‌ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ప్రస్తుతం లండన్‌లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ఆమె మరణ వార్తని సోషల్ మీడియాలో వెల్లడించారు. 


"నీతి ఆయోగ్‌లో LIFE ప్రోగ్రామ్‌లో చేష్టా కొచ్చర్ నాతో పాటు పని చేశారు. ఆ తరవాత బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు లండన్‌ వెళ్లారు. ఆమె సైక్లింగ్ చేస్తుండగా ఓ ట్రక్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె తెలివైందే కాదు. చాలా ధైర్యవంతురాలు. ఇలా హఠాత్తుగా చనిపోవడం బాధాకరం"


- అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో






మార్చి 19వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆమె భర్త కాస్త దూరంలో ఉన్నారు. ట్రక్ వచ్చి ఢీకొట్టిన వెంటనే ఆమె కిందపడిపోయారు. ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్ట్‌ జనరల్ ఎస్‌పీ కొచ్చర్‌కి మృతదేహాన్ని అప్పగించారు. కూతురు మరణ వార్తతో కుంగిపోయిన ఆయన లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 


"నా కూతురు మృతదేహాన్ని తీసుకునేందుకు వచ్చాను. మార్చి 19వ తేదీన సైక్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మరణ వార్త మమ్మల్నే కాదు తన సన్నిహితులందరినీ కలిచివేసింది"


- ఎస్‌పీ కొచ్చర్, చేష్టా కొచ్చర్ తండ్రి