Brahmamudi Serial Today Episode: తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోలేని తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కానీ డబ్బుతో నిజాన్ని పాతిపెట్టకూడదు. నేను కావాలనుకుంటే నాకు కావాల్సినవి నా కాళ్ల దగ్గరకు తెప్పించుకునేదాన్ని అంతే కానీ నాకు డబ్బు మీద ఆస్థుల మీద ఇక్కడున్న వాళ్లకు ఉన్నంత ఆశ లేదు. ఇప్పుడు మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే మీ అబ్బాయి చేసిన తప్పు గురించి ఆలోచించండి.  అంతే కానీ ఆ పసివాణ్ని నేను బాధపెట్టలేను అంటూ కావ్య, అపర్ణకు చెప్తుంది.


ఇందిరాదేవి: శభాష్‌ కావ్య నా మనవరాలు అనిపించుకున్నావు. గొప్పగా ఆలోచించాలి అంటే ఇలాంటి గొప్ప ఇంట్లో ఉంటేనో గొప్ప కుటుంబంలో పుడితేనో రాదు.


రుద్రాణి: అంటే వదిన నిర్ణయాన్ని నువ్వు కూడా తప్పు పడుతున్నావా అమ్మ


ఇందిరాదేవి: రాజ్‌ చేసిన తప్పుకు పసివాణ్ని బాధపెట్టకూడదు. కావ్య ఎంత గొప్పగా ఆలోచించిందో మీకు అర్థం కావడానికి ఈ జన్మ సరిపోదు. కావ్య నువ్వేమి చేసినా నేను నీకు తోడుగా ఉంటాను.


అంటూ ఇందిరాదేవి చెప్పగానే కావ్య వెళ్లిపోతుంది. ఇందిరాదేవి వెళ్లిపోతుంది. తర్వాత రుద్రాణి వారసుడు వచ్చిన వేళ నీ మాటకు విలువ పడిపోతుంది వదిన అంటూ అపర్ణకు చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు పైన బాబుకు పట్టడానికి కావ్య పాలు తీసుకొస్తుంది. రాజ్‌ పాలు పట్టిస్తూ  కావ్యకు థాంక్స్‌ చెప్తాడు.


కావ్య: మీరు థాంక్స్‌ చెప్పడం వల్ల నాకు ఒరిగేదేంటి?


రాజ్‌: అది నా బాధ్యత.


కావ్య: ఆ బాధ్యత పక్కన పెట్టుకున్నారు కదా


రాజ్‌: నువ్వు కాస్త పంచుకున్నావు కదా


కావ్య: పంచుకున్నాను కదా అని పెంచుకోలేను


అని కావ్య అనగానే నువ్వు ఆశించే జవాబు నా నుంచి రాదు అంటూ రాజ్‌ అనగానే కావ్య ఏడుస్తూ తన బాధని మరోసారి రాజ్ తో చెప్తుంది. భూదేవిలోనూ భూకంపం వస్తుంది అంటూ కావ్య చెప్పగానే.. కష్టాన్ని నష్టాన్ని నీకు రాకుండా చేస్తాను అంటూ రాజ్‌ డైవర్స్‌ పేపర్స్‌ మీద సంతకం చేసి ఇస్తాడు. దీంతో కావ్య షాక్‌ అవుతుంది.


రాజ్‌: ఈ నరకం నుంచి విముక్తి పొందే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఇన్నాళ్లు ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వచ్చాను. నీ జీవితం నీది ఈ నిర్ణయం నీది. వీడ్కోలు చెప్పుకోవడం తప్పా నిన్ను ఆపే శక్తి నాకు లేదు.


కావ్య: పూర్తయిందా? నీ బాధ్యత తీరిపోయిందా? నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోవాలంటే ఈ కాగితాలు సంతకాలు అవసరమా?   


రాజ్‌: నువ్వు  కోరుకున్నదే కదా?


కావ్య: నేను కోరుకున్నవన్నీ చేశారా? అసలు ఏం అనుకుంటున్నారు. మీరు ఉండమంటే ఉండాలి మీరు పొమ్మంటే పోవాలి. అన్నింటికీ తలవంచాలి లేదంటే విడాకులు తీసుకోవాలి.


రాజ్‌: అంటే


కావ్య: నేను ఇలా వెళ్లను. ఇంత సింపుల్‌గా తెగదెంపులు చేసుకుని నేను వెళ్లను. ఈ బిడ్డకు తల్లి ఎవరో తెలియాలి. తాళి కట్టిన భార్య ఉండగా ఆ తల్లి తల్లిగా ఎలా మారిందో తెలియాలి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికిన రోజు నేను వెళ్లాలో ఇక్కడే ఉండి పోవాలో  నిర్ణయించుకుంటాను. అప్పటి వరకు నన్ను వెళ్లమనే అధికారం మీకు లేదు.


అంటూ పేపర్స్‌ రాజ్‌ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు అనామిక వాళ్ల అమ్మకు ఫోన్‌ చేసి ఇంట్లో జరుగుతున్న విషయాలు మొత్తం చెప్తుంది. అది విన్న  అపర్ణ వచ్చి ఫోన్‌ లాక్కుంటుంది. ఇంట్లో విషయాలు ఎందుకు చెప్తావని కోప్పడుతుంది. రుద్రాణి చూసి ధాన్యలక్ష్మిని తీసుకొస్తుంది. ధాన్యలక్ష్మీ కూడా అనామికను తిడుతుంది. ఇంటి పరువు బజారున పడేస్తావా? అంటూ నిలదీస్తుంది. అపర్ణను కూడా నిలదీస్తుంది. అనామికను తిడితే సమస్య పరిష్కారం అవుతుందా అంటూ అడుగుతుంది. అపర్ణ, అనామిక వెళ్లాక రుద్రాణి నువ్వేంటి నువ్వు మీ తోడికోడలును తిట్టకుండా నీ కోడలును తిట్టావేంటి అని అడుగుతుంది. నేను నీ రూట్‌లోనే వెళ్తున్నాను రుద్రాణి అంటూ ధాన్యలక్ష్మీ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: బర్త్ డేకి కాదు... సోమవారమే రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!