Diaper keeps 20 day old baby from drowning: అద్భుతాలు సినిమాల్లోనే జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని నిజంగానే జరుగుతాయి. అలాంటి ఘటనే ఇది. ఇరవై ఏళ్ల చిన్నారిని డైపరే కాపాడింది.
ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లా సియోని గ్రామంలో ఊహించని అద్భుతం జరిగింది. మృత్యువు అంచుల్లోకి వెళ్లిన ఒక 20 రోజుల పసికందు కేవలం తను వేసుకున్న డైపర్ కారణంగా ప్రాణాలతో తిరిగి వచ్చింది. సునీత అనే మహిళ తన పసిబిడ్డకు పాలు ఇస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన కోతుల గుంపు ఆమెపై దాడి చేసింది. ఈ క్రమంలో ఒక కోతి ఆమె ఒడిలోని పసిబిడ్డను బలవంతంగా లాక్కెళ్లి ఇంటి పైకప్పు మీదికి పారిపోయింది. భయాందోళనకు గురైన తల్లి, గ్రామస్థులు కేకలు వేస్తూ కోతిని వెంబడించడంతో, కంగారుపడ్డ ఆ కోతి పక్కనే ఉన్న ఒక లోతైన బావిలోకి చిన్నారిని విసిరేసి పారిపోయింది.
పసిబిడ్డ బావిలో పడటంతో అంతా ప్రాణాలు పోయాయని భావించారు. కానీ, అద్భుతమనేలా ఆ పసికందు నీటిలో మునగకుండా పైనే తేలుతూ కనిపించింది. వెంటనే గ్రామస్థులు బకెట్ సాయంతో చిన్నారిని బయటకు తీశారు. దాదాపు పది నిమిషాల పాటు చిన్నారి నీటిపై తేలియాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై స్థానిక నర్సు రాజేశ్వరి పాపకు వేసిన డైపర్ లోపల గాలి ఉండటం వల్ల అది ఒక లైఫ్ జాకెట్ లా పనిచేసిందని, దానివల్ల పాప నీటిలో మునిగిపోకుండా తేలిందని వివరించారు. డైపరే ఈ చిన్నారి ప్రాణాలను కాపాడిందని ఆమె పేర్కొన్నారు.
బావి నుంచి బయటకు తీసిన సమయంలో శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని గమనించిన నర్సు రాజేశ్వరి, వెంటనే సీపీఆర్ అందించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమయానికి నర్సు అక్కడ ఉండటం, డైపర్ కారణంగా చిన్నారి తేలడం వల్లే పునర్జన్మ లభించిందని తండ్రి అరవింద్ రాథోడ్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన స్థానిక అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ ప్రాంతంలో కోతులు, అడవి జంతువుల దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. జనావాసాల్లోకి అడవి జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని, చిన్నపిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
