DGP Rajendra Nath: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలీసులు అందించిన సేవలు అభినందనీయం అన్నారు డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి. యువ ఎస్పీలకు ఇది మంచి అనుభవం అని అన్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలకు సంభందించిన సమావేశం నిర్వహించామని ఆయన చెప్పుకొచ్చారు. లోకదాలత్ లో పోలీసులు చేసిన కృషి అనిర్వచనీయం అని.. 47 వేల ఎఫ్ఐఆర్ కేసులు పరిష్కరించారన్నారు. లక్ష పెటీ కేసులు కూడా పరిష్కరించారని గుర్తు చేశారు. ఎస్పీలే నేరుగా కేసులు పరిష్కరించేందుకు అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చారు.  కమిషనరేట్ పరిధిలో 10 కేసులు కన్విక్షన్ చేశారని డీజీపీ తెలిపారు. 


రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో వివిధ మార్పులు తెచ్చామని వివరించారు. 13, 200 కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు. తిరుపతిలో మరో రాష్ట్ర స్థాయి పోలీస్ సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సైబర్ నేరనియంత్రణ వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని చెప్పుకొచ్చారు. సైబర్ వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి వివరించారు. 


లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తాం..


లోను యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా వారు అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దని డీజీపీ సూచించారు. రుణాలు తీసుకొనే క్రమంలో యాప్ నిర్వాహకులు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషను, కాంటాక్ట్ నంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళి పోతుందన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. 


బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ల వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.


గంజాయి పై డీజీపీ ఏమన్నారంటే...


గంజాయి నిర్మూలనకు పోలీసుశాఖ సమర్ధవంతంగా చర్యలు చేపట్టిందన్నారు. పోలీసుశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా చాలా వరకు ఏజన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు లేకుండా నియంత్రించామన్నారు. గిరిజనులు గంజాయికి బదులుగా వేరే పంటలతో లబ్ధి పొందే విధంగా ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఆకస్మికంగా వాహన, లాడ్జి తనిఖీలు చేపడుతున్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని, వివరాలను రాబడుతున్నామన్నారు. 


మన రాష్ట్రం మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా గంజాయిని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్లయితే రానున్న 3-4సంవత్సరాల్లో గంజాయి అక్రమ రవాణను పూర్తిగా నియంత్రించవచ్చునన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు ఎఓబిలో ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు. జిల్లాల పునర్విభజనతో ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించామన్నారు. సిబ్బంది, వాహనాలు, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల్లో చాలా వరకు సమస్యలు లేకుండా పరిష్కరించామన్నారు. పోలీసు నియామకాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని రాష్ట్ర డిజిపి కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.