Prajwal Revanna sentenced to life imprisonment: అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవిత కాల జైలు శిక్ష విధించింది. పని మనిషిని చాలా కాలం పాటు లైంగికంగా వేధించారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. శుక్రవారమే ఆయనను కోర్టు దోషిగా నిర్దారించింది. శనివారం శిక్షను ఖరారు చేసింది. శిక్షను ఖరారు చేసే ముందు ప్రజ్వల్ రేవణ్ణను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన తనకు తక్కువ శిక్ష విధించాలని ఆయన కోర్టు ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయినా ఆయనకు జీవిత ఖైదు పడింది. ప్రజ్వల్ రేవణ్ణకు పది లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇందులో రూ.7 లక్షలు బాధితురాలికి చెల్లించాలని ఆదేశించారు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు శుక్రవారం దోషిగా నిర్ధారించింది. శిక్షను శనివారం ఖరారు చేసింది. హాసన్ జిల్లాలోని గన్నికడ ఫామ్హౌస్లో పనిచేసిన 48 ఏళ్ల మహిళపై 2021లో రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదు అయింది. 2024 ఏప్రిల్లో హాసన్లో లీకైన 2,900కు పైగా వీడియోలు, ఫోటోల తర్వాత నమోదయ్యాయి. 48 ఏళ్ల పని మనిషిపై ప్రజ్వల్ రేవణ్ణ రెండుసార్లు అత్యాచారం చేసి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు లీక్ అయిన తర్వాత పని మనిషి తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కుమార్తెను వీడియో కాల్స్ ద్వారా ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా వేధించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. ఆ తర్వతా బెయిల్ కోసం బెంగళూరు ప్రత్యేక కోర్టు, కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు, కానీ అన్ని పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆ తరవాత తిరిగి వచ్చారు. 2024 మే 31న భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే అతన్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను జైలులో ఉన్నాడు ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవేగౌడ మనవడు . హోలెనరసిపుర జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణ కుమారుడు. ఈ కేసుల తర్వాత జేడీ(ఎస్) అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై మరో మూడు కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన మూడు అత్యాచారం కేసులు, ఒక లైంగిక వేధింపు కేసు నమోదయ్యాయి. ఇందులో ఒక కేసులో శిక్ష పడింది. మరో కేసులో హసన్ నియోజకవర్గంలోని జిల్లా పంచాయతీ సభ్యురాలిపై మూడు సంవత్సరాల పాటు పదేపదే లైంగిక దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజ్వల్ అత్యాచార ఘటనలను వీడియోలో రికార్డ్ చేసి, బాధితురాలిని బెదిరించడానికి , బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 13న SIT ఈ కేసులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇతర కేసుల్లోనూ విచారణ జరుగుతోంది.