Delhi Excise Policy Case: ఫేక్ కేసులో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు: దిల్లీ డిప్యూటీ సీఎం

ABP Desam   |  Murali Krishna   |  17 Oct 2022 11:56 AM (IST)

Delhi Excise Policy Case: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం ఆప్ కీలక నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

(Image Source: PTI)

Delhi Excise Policy Case: ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ అగ్ర నేత మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు సీబీఐ ఆదివారం సమన్లు జారీ చేసింది. సీబీఐ కార్యాలయానికి చేరుకునేముందు సిసోడియా ఓ ట్వీట్ చేశారు.

నాపై పూర్తిగా ఫేక్ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారానికి గుజరాత్ వెళ్లాల్సి ఉంది. వాళ్లు (భాజపా) గుజరాత్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోబోతున్నారు. అందుకే నన్ను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేయడమే వారి ఉద్దేశం.   -                                                          మనీశ్ సిసోడియా, దిల్లీ డిప్యూటీ సీఎం
.

14 గంటలు

మనీశ్ సిసోడియా నివాసంలో ఆదివారం 14 గంటల పాటు సీబీఐ సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనకు సమన్లు జారీ చేసింది.
 
నా ఇంట్లో 14 గంటల పాటు సీబీఐ దాడులు జరిగాయి. ఏమీ దొరకలేదు. నా బ్యాంక్ లాకర్‌ను వెతికారు, దానిలో కూడా ఏమీ దొరకలేదు. వారు మా గ్రామంలో ఏమీ కనుగొనలేదు.                                             "
- మనీశ్ సిసోడియా, దిల్లీ ఉప ముఖ్యమంత్రి

లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ వారం ప్రారంభంలో 25కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

ఇదీ కేసు

దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.

దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల ఘజియాబాద్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉన్న సిసోడియా బ్యాంకు లాకర్‌ను కూడా ఆయన సమక్షంలో సీబీఐ పరిశీలించింది.

Also Read: Joe Biden Advice: బాలికకు బైడెన్ సలహా- అప్పటివరకు సీరియస్‌ డేటింగ్ వద్దట!

Published at: 17 Oct 2022 11:48 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.