Sitaram Yechuri: ఇటీవల మృతి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి పలువురు రాజకీయ నేతలు, వామపక్ష భావజాలవేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులు, జననాట్యమండలి కళాకారులు కన్నీటి పర్యంతమై నివాళులు అర్పించారు. లాల్ సలామ్ నినాదాలు చేశారు. ఏచూరి భౌతికకాయాన్ని దేశ రాజధానిలోని వసంత్ కుంజ్‌లోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో భాయ్ వీర్ సింగ్ మార్గ్‌లోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌కు తరలించారు. పార్టీ నేతలు, సీపీఎం అభిమానులను సందర్శనార్థం అక్కడే ఉంచారు.  కేరళ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్,  డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, టీఆర్ బాలు, దయానిధి మారన్... పలువురు ప్రముఖులు సీతారాం ఏచూరి మృతదేహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నాం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని అక్కడే ఉంచారు.  అనంతరం మృతదేహాన్ని సంతాప యాత్రగా ఎయిమ్స్‌కు తరలించి, వైద్య విద్యార్థులకు చదువు నిమిత్తం అప్పగించారు.
 


ముగిసిన ఏచూరి శకం
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర కొనసాగింది. దివికేగిన ఏచూరికి వివిధ దేశాల ప్రతినిధులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. కడవరకు ప్రజాగొంతుకగా నిలిచిన కామ్రేడ్ ను తలుచుకుని కన్నీటి పర్వంతం అయ్యారు.  అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి రీసెర్చ్ కోసం అప్పగించారు. దివంగత నేతకు నివాళులర్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, గుజరాత్, ఢిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన సీపీఐ(ఎం) నేతలు ఆయనకు నివాళులర్పించారు.






 ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి  
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సీతారాం ఏచూరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. సీతారాం ఏచూరి రాజకీయ నాయకుడే కాదు గొప్ప ఆర్థికవేత్త, సామాజికవేత్త, కాలమిస్ట్ కూడా. 1992 నుండి నేటి వరకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే.. సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు వర్గాలను, దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సీతారాం ఏచూరి స్వస్థలం కాకినాడ . ఆయన  తల్లిదండ్రులు మద్రాసులో స్థిరపడ్డారు. ఆయన అక్కడే జన్మించారు.  యన సోమేశ్వర సోమయాజుల ఏచూరి, కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12న జన్మించారు. సీతారాం ఏచూరి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు.