Congress topless protest at AI Summit:  దేశ ప్రతిష్టను ప్రపంచ యవనికపై చాటిచెప్పేందుకు భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  గ్లోబల్ ఏఐ  సమ్మిట్  వేదికగా జరిగిన ఒక అనూహ్య ఘటన ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అనుబంధ విభాగమైన యూత్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన అర్థనగ్న నిరసన, దేశ విదేశీ ప్రతినిధుల ముందు భారత్ గౌరవానికి భంగం కలిగించేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు, ఇన్వెస్టర్లు , వివిధ దేశాల ప్రతినిధులు భారత్  సాంకేతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న తరుణంలో ఈ నిరసన చోటుచేసుకుంది. దేశాభివృద్ధికి కీలకంగా భావిస్తున్న సమ్మిట్‌లో ఇలాంటి  అర్థనగ్న ప్రదర్శనలు చేపట్టడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు చులకన అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం రాజకీయ నిరసనగా కాకుండా, దేశ ప్రతిష్టను దిగజార్చే చర్యగా ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.

Continues below advertisement

సొంత పార్టీ ముఖ్యమంత్రికే సంకట పరిస్థితి 

ఈ నిరసన జరిగిన సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సదస్సులో ప్రసంగిస్తున్నారు.  ఒకవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తుంటే, అదే పార్టీకి చెందిన కేడర్ ఇలాంటి విపరీత ధోరణులకు పాల్పడటం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ శ్రేణులే గండికొట్టినట్లయ్యిందని  భావిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక , టెక్ రంగ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.  రాజకీయాల్లో విభేదాలు సహజమని, కానీ దేశ ప్రతిష్టకు సంబంధించిన అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి వికృత చేష్టలు తగవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో దేశ వ్యతిరేక ధోరణులను  ప్రోత్సహిస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి సదస్సును రాజకీయ రణరంగంగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.  

Continues below advertisement

అయోమయంలో కాంగ్రెస్ అధిష్టానం 

ఈ విమర్శల ధాటికి కాంగ్రెస్ పార్టీ సరైన వివరణ ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. ప్లానింగ్ ప్రకారం జరిగిందా లేదా యువజన విభాగం అత్యుత్సాహంతో చేసిందా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నష్టం మాత్రం జరిగిపోయింది. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు దాడిని ఉధృతం చేశాయి. ముఖ్యంగా ఏఐ రంగంలో భారత్ అగ్రగామిగా ఎదిగే క్రమంలో ఈ ఘటన ఒక మచ్చగా మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  

భద్రతా వైఫల్యంపై కూడా ప్రశ్నలు 

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ సదస్సులోకి నిరసనకారులు ఎలా ప్రవేశించారనే దానిపై కూడా భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇది కేవలం నిరసన మాత్రమే కాదని, సమ్మిట్‌ను భగ్నం చేసే కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఏది ఏమైనా, ఈ ఘటన కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చిపెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.