Dharmendra Pradhan Resignation Demand:  సామాజిక మాధ్యమాల్లో ‘మీమ్స్’, వ్యంగ్య పోస్టులతో భారీ హైప్ సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్‌ఈ (CBSE) మార్కుల లీకేజీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ పార్టీ తొలి ప్రత్యక్ష నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, ఆన్‌లైన్ ప్రపంచంలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో డిజిటల్ విప్లవంలా కనిపించిన ఈ ఉద్యమం, ఆఫ్‌లైన్  రాజకీయాల్లోకి వచ్చేసరికి చప్పగా సాగింది.

Continues below advertisement

ఆఫ్‌లైన్‌లో పెద్దగా కనిపించని కాక్రోచ్‌ల హంగామా

ఈ డిజిటల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ఐటీ ప్రొఫెషనల్ అభిజీత్ దీప్కే.. ఈ నిరసన కోసమే ప్రత్యేకంగా అమెరికా నుండి శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో తనను అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళనల నడుమ, ఆయన నేరుగా ఢిల్లీ పోలీసుల అనుమతితో జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ధర్నాలో కూర్చున్నారు. ఆన్‌లైన్ వేదికలపై ఈ నిరసనకు భారీ ఎత్తున యువత తరలివస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, వాస్తవానికి జంతర్ మంతర్ వద్దకు పట్టుమని కొన్ని వందల మంది మాత్రమే హాజరయ్యారు.   

Continues below advertisement

నిరసనకు హాజరైన సోనమ్  వాంగ్ చుక్ 

ధర్నా జరిగిన ప్రాంతంలో నిరసనకారుల కంటే   రక్షణ వలయంగా నిలిచిన పోలీసులు, జాతీయ మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు , యూట్యూబర్లే ఎక్కువగా కనిపించారు. హాజరైన కొద్దిమంది యువకులు బొమ్మలు, పుస్తకాలు , కాక్రోచ్   మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ హాజరై మద్దతు ప్రకటించడం ఈ ధర్నాకు కొంత మైలేజ్ తెచ్చిపెట్టింది. అలాగే కమ్యూనిస్టు పార్టీలు, ఆప్‌కు చెందిన రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా హాజరయ్యారు. 

పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్న అభిజిత్ 

 తాము నెల రోజులుగా సోషల్ మీడియా ద్వారా విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి అకౌంట్లను హ్యాక్ చేయించడం, పోస్టులను డిలీట్ చేయించడం వంటి పనులకు పాల్పడుతోందని అభిజిత్ దీప్కే ఆరోపించారు.  మీరు మా పోస్టులను డిలీట్ చేయగలరేమో కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న మమ్మల్ని చెరిపేయలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగానే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

సోషల్ మీడియా హైప్ గ్రౌండ్ లోకి ఎందుకు రాలేదో?

  ఈ నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూర్చుని లైకులు కొట్టడం, మీమ్స్ షేర్ చేయడం సులభమే కానీ, నేరుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం వేరనే సత్యాన్ని ఈ ఘటన నిరూపించింది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై కనిపించే వర్చువల్  హైప్  ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో భారీ జనసందోహంగా మారలేదని, బలమైన క్షేత్రస్థాయి కేడర్ మరియు యంత్రాంగం లేకపోతే ఆన్‌లైన్ ఉద్యమాలు ప్రత్యక్షంగా పెద్దగా సక్సెస్ కాలేవని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.