Civil Aviation Minister Ram Mohan Naidu : ఇండిగో విమానాల రద్దు అంశంతో విమానాశ్రయాల్లో గందరగోళం ఏర్పడింది. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నియమాల వల్ల ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడం, ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు స్వయంగా జోక్యం చేసుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్ గత నాలుగు రోజులుగా 24×7 పనిచేస్తూ, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నుంచి రియల్-టైమ్ అప్డేట్స్ను మానిటర్ చేస్తోంది.
శుక్రవారం మంత్రి రామ్ మోహన్ నాయుడు స్వయంగా కంట్రోల్ రూమ్ను సందర్శించి, పనితీరును సమీక్షించారు. ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్లైన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి వచ్చే డేటాను ఒకే చోట సేకరించి, ఇండిగోతో పాటు అన్ని ఎయిర్లైన్స్కు షేర్ చేస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందేలా చూడటం, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు తగిన సౌకర్యాలు ఫుడ్, వాటర్, హోటల్ ఏర్పాటు వసతులు కల్పించడం, ఇండిగోతో పాటు ఇతర ఎయిర్లైన్స్ను సమన్వయం చేసుకుని, రద్దయిన ఫ్లైట్స్కు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడం వంటి వాటి కోసం ఆదేశాలు జారీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సాధారణ స్థితి త్వరగా పునరుద్ధరణ కావాలని ఆదేశాలుఇచ్చారు. మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా సహా ప్రధాన విమానాశ్రయాల నుంచి ప్రతి నిమిషం అప్డేట్స్ సేకరిస్తున్నారు. ఇండిగోకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. రిసోర్సెస్ మొబిలైజేషన్, పైలట్ & క్రూ రోస్టర్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, విస్తారా, ఆకాశ ఎయిర్ ను అదనపు ఫ్లైట్స్ నడపమని సూచించారు. నిలిచిపోయిన ప్రయాణికులకు హోటల్ బుకింగ్, ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీస్తో సమన్వయం చేసేలా సూచనలిస్తున్నారు.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 5 వరకు 2,500కు పైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు అయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబైలో గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ప్రయాణికులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది అసాధారణ పరిస్థితి అని ప్రయాణికుల ఇబ్బందులు తొలగించడమే మా ప్రధాన లక్ష్యమని రామ్ మోహన్ నాయుడు ప్రకటించారు. ఇండిగోతో పాటు అన్ని ఎయిర్లైన్స్, విమానాశ్రయాలతో నిరంతరం సమన్వయం చేస్తున్నాంని త్వరలోనే సాధారణ స్థితి పునరుద్ధరణ జరుగుతుంది అని హామీ ఇచ్చారు.