Chinese Colleges: కాలేజీలో పిల్లలు ప్రేమ అంటే పెద్ద‌లెవ‌రైనా మందలిస్తారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం తమ దేశంలో యువతీయువకులను ప్రేమించుకోండి అంటూ ప్రోత్స‌హిస్తోంది. విద్యార్థులు పీకల్లోతు ప్రేమల్లో మునిగి తేలేందుకు ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇస్తోంది. చైనాలో ఏర్పడిన జనాభా సంక్షోభమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. చైనాలో జననాలు, వివాహాల శాతాలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. గడచిన ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనా జనాభా గత ఏడాది తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. అక్కడి వివిధ కార్పొరేట్‌ సంస్థలు సైతం నెల రోజుల పాటు వివాహ సెలవుల్ని మంజూరు చేస్తున్నాయి.


ప్రేమ పేరెత్తితే చాలు.. ఇండియాలో పేరెంట్స్, టీచర్లు మండిపడతారు. చ‌దువుకోవ‌ల‌సిన వ‌య‌సులో ప్రేమ గీమ‌ వద్దని.. బుద్ధిగా చదువుకోవాలని చెబుతూ క్లాసులు పీకుతారు. అయితే చైనా లో మాత్రం.. మీరు ప్రేమలో పడండి మీకు సెలవులు కూడా ఇస్తామని కాలేజ్ యాజమాన్యాలే చెప్పడం ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. చైనాలో జననాల రేటు పడిపోవడంతో అక్కడి ప్రభుత్వం కొన్నాళ్లుగా ఆందోళ‌న చెందుతోంది. దీంతో జననాల రేటును పెంచుకోవడానికి.. కొన్ని కాలేజీలు విద్యార్థులకు వారం రోజుల పాటు ‘లవ్ హాలిడేస్ ‘ మంజూరు చేశాయి. ఏప్రిల్ 1 నుండి 7వ తేదీ వరకు ప్రేమించుకోవాలని… రొమాన్స్, లైఫ్ మీద ఫోకస్ చేయాలని, ప్రకృతిని ఆస్వాదించాలని చెబుతూ వారికి వన్ వీక్ లవ్ హాలీ డేస్ ప్రకటించాయి.


నిజానికి చైనాకు.. ఎప్పుడూ దూకుడుగా ఉంటూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలవడం అలవాటే. ఇప్పుడు అలాగే మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం జననాల రేటు పడిపోవటంతో.. పెంచే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటున్న చైనా.. దీనికోసం ప్రజలను ప్రోత్సహించేలా ప్రయత్నాలు మొదలెట్టింది. ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే రాయితీలూ ఇస్తోన్న చైనా.. ఇప్పుడు ఏకంగా ‘ప్రేమలో పడండి” అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది.  ఫ్యాన మీయి ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్న మిన్యాంగ్ ఫ్ల‌యింగ్ ఒకేషనల్‌ కాలేజ్‌.. విద్యార్థులకు ‘లవ్ హాలీ డేస్ అంటూ ఏప్రిల్‌ నెలలో వారం రోజులు సెలవులు ఇచ్చేసింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ..జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని ప్రోత్స‌హిస్తోంది.


జనాభా తగ్గుదలే కారణమా?
ప్రపంచంలో అత్యధిక జనాభా (Population) కలిగిన దేశం చైనా. అయితే, ఇప్పుడు ఈ విషయంలో భార‌త్‌ చైనాను అధిగ‌మించ‌బోతోంది. మన దేశంలో జనాభా పెరుగుదల విపరీతంగా ఉంటే, చైనాలో మాత్రం తగ్గుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచ జనాభాలో చైనా నెంబర్ వన్‌గా ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు చేపట్టింది. దీనిలో భాగంగా 1980-2015 మధ్య కాలంలో వన్ చైల్డ్ పాలసీ (One Child Policy) తీసుకొచ్చింది. అంటే ఏ జంట అయినా.. ఒక్కరికి మించి పిల్లల్ని కనడానికి వీల్లేదు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి ప్రభుత్వ పథకాల ద్వారా అందే సాయం రాకుండా చేశారు. దీంతో చాలా మంది ఒక్కరిని మాత్రమే కంటూ వచ్చారు. ఈ కారణంగా దేశంలో జనాభా తగ్గిపోయింది. ఇంకోవైపు చైనాలో పిల్లల పెంపకం ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. విద్య, వైద్యం, ఇతర ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు ఆదాయం తగ్గిపోయింది. దీంతో పిల్లల్ని పెంచడం కష్టమని భావించి చాలా మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. జనాభా తగ్గుదలకు ఇది కూడా మరో కారణం.


తగ్గిన జననాల రేటు
కొంతకాలంగా భారీ స్థాయిలో జననాల రేటు తగ్గిపోయింది. 60 ఏళ్ల తర్వాత 2021లో జననాల రేటు తక్కువ నమోదైంది. గత ఏడాది ప్రతి వెయ్యి మందికి సగటున 6.77 జననాలు మాత్రమే నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇది 7.52గా ఉంది. కోవిడ్ (Covid) సమయంలో చాలా మంది ఇంటికే పరిమితమైనప్పటికీ పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపలేదని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. పెళ్లి అయిన వారి పిల్లలకు మాత్రమే ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం కూడా అక్కడి వాళ్లు పిల్లల్ని కనకపోవడానికి ఇంకో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. జననాల రేటు (Birth Rate) తగ్గడం వల్ల చైనాలో జనాభా తగ్గుతోంది. ఈ పరిస్థితి దేశానికి ప్రమాదకరం అని భావించిన ప్రభుత్వం ఈ చట్టాల్లో మార్పులు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రజలు పిల్లల్ని కనేలా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.


పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు
జనాభా పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సూచనల ఆధారంగా చైనా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఉన్న అనేక నిబంధనల్ని ఇప్పుడు చైనా ప్రభుత్వం తొలగిస్తోంది. వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది. అంటే ఇకపై చైనాలో ముగ్గురు పిల్లల్ని అయినా కనొచ్చు. ముగ్గురు పిల్లల్ని కంటే వారిలో ఒకరికి ఉచిత విద్య (Free Education) అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే ఇతర సబ్సిడీలు కూడా ఇస్తుంది. అలాగే పెళ్లి కాని జంటల పిల్లలకు కూడా ప్రభుత్వ గుర్తింపు ఇచ్చేందుకు అంగీకరించింది. మహిళలకు పెయిడ్ మెటర్నిటీ లీవ్ (Paid Maternity Leave) ఇవ్వాలని నిర్ణయించింది. మహిళలకు వాళ్లు పని చేస్తున్న కంపెనీ పెయిడ్ లీవ్ ఇవ్వలేకపోయినా, ప్రభుత్వమే పెయిడ్ లీవ్ ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వమే వారికి డబ్బులు చెల్లిస్తుంది. గర్భ‌ సంబంధిత చికిత్స ఖర్చుల్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది. మగవారికి కూడా పెటర్నిటీ పెయిడ్ లీవ్ ఇవ్వాలనుకుంటోంది.


యువతను ప్రోత్సహించేలా
జనాభా పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల్లో భాగంగా యువతను కూడా ప్రోత్సహించాలనుకుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కాలేజీలు తీసుకున్న నిర్ణయమే సెలవులు. విద్యార్థులకు సెలవులు ఇచ్చి, వాళ్లు ప్రేమలో, రొమాన్స్‌లో మునిగితేలేలా చూడటమే ఈ సెలవుల లక్ష్యం. ప్రకృతితో మమేకమై, జీవితాన్ని ఆస్వాదించడం, నచ్చినట్టు సంతోషంగా గడపడం కూడా ఈ సెలవుల ఉద్దేశం. అయితే, విద్యార్థులు ఈ సెలవులు తీసుకోగానే సరిపోదు.. వాటికి సంబంధించి డైరీ రాయాలి. హోమ్ వర్క్ పూర్తి చేయాలి. వాళ్లు సాధించిన ప్రగతిని తెలియజేయలి. వారి ట్రావెలింగ్‌కు సంబంధించిన విశేషాల్ని వీడియో తీసి అందించాలి. గత నెల నుంచే కాలేజీలు సెలవులు ప్రకటించాయి. ఇప్పటివరకు మొత్తం 9 కాలేజీలు ఇలా సెలవులు ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొన్ని కాలేజీలు ఈ నెల మొదటివారంలో సెలవులు ప్రకటించాయి. వారం రోజులపాటు ఈ లవ్ హాలీడేస్ ఉంటాయి.