China Taiwan Conflict: తైవాన్‌ను చుట్టుముట్టిన చైనా యుద్ధ విమానాలు- యుద్ధం తప్పదా!

ABP Desam   |  Murali Krishna   |  26 Dec 2022 10:41 AM (IST)

China Taiwan Conflict: తైవాన్‌ను దక్కించుకునేందుకు చైనా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. తాజాగా 71 యుద్ధ విమానాలతో తైవాన్ గగనతలంలో విన్యాసాలు చేపట్టింది.

(Image Source: Getty)

China Taiwan Conflict: తైవాన్‌పై ఎప్పటి నుంచో కన్నేసిన చైనా.. తాజాగా స్ట్రైక్ డ్రిల్స్ చేపట్టింది. వారాంతంలో తైవాన్ చుట్టూ 'స్ట్రైక్ డ్రిల్స్' కోసం చైనా దాదాపు 71 యుద్ధ విమానాలను ఉపయోగించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈరోజు ఉదయం 6 గంటలకు మా పరిసర ప్రాంతంలో తైవాన్ చుట్టూ 71 PLA విమానాలు, 7 PLAN నౌకలను మేం గుర్తించాం. మేం గుర్తించిన విమానాలలో 47.. తైవాన్ జలసంధి మెరిడియన్ రేఖను దాటి తైవాన్ ఆగ్నేయ ADIZలోకి ప్రవేశించాయి. బీజింగ్.. ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తోంది. తైవాన్ ప్రజలను అణచివేయడానికి ప్రయత్నిస్తోంది.  - తైవాన్ రక్షణ శాఖ

చైనాను హెచ్చరించేందుకు తైవాన్ కూడా తమ యుద్ధ విమానాలను పంపింది. అయితే క్షిపణి వ్యవస్థలు వారి విమానాలను పర్యవేక్షించినట్లు తైవాన్ పేర్కొంది.

చైనా రియాక్షన్

ఈ విన్యాసాలపై చైనా కూడా ఘాటుగానే స్పందించింది. తైవాన్, అమెరికా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా తాము ఆ ద్వీపం చుట్టూ ఉన్న సముద్రం, గగనతలంలో "స్ట్రైక్ డ్రిల్స్" నిర్వహించినట్లు చైనా తెలిపింది.

తైవాన్‌ను తన భూభాగంగా చైనా ఎప్పటినుంచో పరిగణిస్తోంది. బీజింగ్ పాలనను అంగీకరించాలని స్వయం-పాలిత తైవాన్ ద్వీపాన్ని ఇటీవలి కాలంలో ఎక్కువగా చైనా ఒత్తిడి చేస్తోంది. చైనా వాదనను తిరస్కరించిన తైవాన్, తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే దాడి చేస్తే తమను తాము రక్షించుకుంటామని చెబుతోంది.

బీజింగ్ అనేక హెచ్చరికల మధ్య ఆగస్టులో యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటించారు. దీంతో చైనా- తైవాన్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆమె పర్యటన తరువాత, చైనా.. ద్వీప దేశం చుట్టూ సైనిక కసరత్తులను వేగవంతం చేసింది.

ఈ పర్యటన తర్వాత అమెరికా- చైనా సంబంధాలు కూడా సన్నగిల్లాయి. పెలోసి పర్యటన సందర్భంగా చైనా చేసిన హెచ్చరికలతో పెంటగాన్ (అమెరికా రక్షణ విభాగం).. డ్రాగన్ దేశం కదలికలను రౌండ్ ది క్లాక్ పర్యవేక్షించింది. చైనాతో తీవ్ర ఉద్రిక్తత ఉన్న సమయంలో పెలోసి తైవాన్‌లో పర్యటించడం.. యూఎస్, చైనా రెండింటికీ చాలా ఇబ్బంది కలిగించింది. అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తర్వాత  హౌస్ స్పీకర్ మూడో స్థానంలో ఉంటారు.

Also Read: Tamilnadu Crime News: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన ఎస్ఐ!

Published at: 26 Dec 2022 10:31 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.