China's Attempts To Alter Status Quo: 'అఫ్గాన్‌ ఆ పనిచేయకూడదు.. చైనా వల్లే శాంతికి విఘాతం'

ABP Desam   |  Murali Krishna   |  20 Sep 2021 06:44 PM (IST)

అప్గానిస్థాన్‌ ప్రస్తుత పరిణామాలపై భారత్ మరోసారి స్పందించింది. అఫ్గాన్ సహా చైనా వల్ల భారత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొంటుందని విదేశాంగ కార్యదర్శి వ్యాఖ్యానించారు.

చైనా వల్లే సరిహద్దుల్లో శాంతికి విఘాతం

అఫ్గానిస్థాన్‌, చైనా వల్ల భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాల వల్ల భారత్.. బలమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. 6వ జేపీ మోర్గాన్ ఇండియా ఇన్‌వెస్టర్ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏడాదిగా లద్దాఖ్‌లో సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చాలా సార్లు ప్రయత్నించింది. ఈ కారణంగా సరిహద్దులో శాంతి సుస్థిరతలకు తీవ్ర భంగం వాటిల్లింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించినట్లే. ద్వైపాక్షిక బంధంపైనా ఇవి ప్రభావం చూపిస్తాయి.                                 - హర్షవర్ధన్ ష్రింగ్లా, భారత విదేశాంగ కార్యదర్శి

భారత్- చైనా బంధం.. పరస్పర గౌరవం, పరస్పర సహనం, పరస్పర ప్రయోజనాలు అనే మూడు అంశాలపైనే ఆధారపడి ఉంటుంది.

అఫ్గాన్ సంక్షోభం..

అఫ్గాన్ సంక్షోభంపై కూడా ష్రింగ్లా స్పందించారు. ఓ సరిహద్దు దేశంగా అఫ్గాన్‌లో జరుగుతోన్న పరిణామాలపై భారత్ ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు. ఆ ప్రభావం భారత్‌తో పాటు మొత్తం ప్రాంతంపై ఉంటుందని స్పష్టం చేశారు. 

అఫ్గాన్ భూమి ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, సాయానికి అడ్డా కాకూడదు. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలకు వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించకూడదు.                               - హర్షవర్ధన్ ష్రింగ్లా, భారత విదేశాంగ కార్యదర్శి

అఫ్గానిస్థాన్ లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది. శాంతి, సామరస్యాలు కలిసిన ప్రజాస్వామ్య అఫ్గాన్​ను భారత్ కోరుకుంటున్నట్లు పేర్కొంది. భారత్ లక్ష్యమంతా సురక్షితంగా ప్రజలను తరలించడేమనని స్పష్టం చేశారు విదేశాంగ శాఖ ప్రతినిధి.

తాలిబన్ల సర్కార్..

అప్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేసినప్పటికీ హక్కానీ వర్గానికి బరాబర్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల ఇరు వర్గాలు తన్నుకున్న ఘటనలు కూడా నెలకొన్నాయి. అయితే మరోవైపు తాలిబన్లు.. మహిళలు, జర్నలిస్టులపై అరాచకాలు సృష్టిస్తున్నారు. పైకి మహిళల హక్కులు కాపాడతామని చెప్తున్నప్పటికీ తాలిబన్లు వారిని విధులకు కూడా హాజరుకానివ్వటం లేదు. యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్‌ను బంద్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. 

Published at: 20 Sep 2021 05:42 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.