Kashmiri Pandits:


రాజకీయ ప్రాధాన్యత కోసం..


జమ్ము కశ్మీర్ రాజకీయాల్లో కశ్మీరీ పండిట్‌ల ప్రాధాన్యత పెంచేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తోంది. జమ్ము, కశ్మీర్ అసెంబ్లీలో కశ్మీరీ పండిట్‌లను నామినేట్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేర్పులు చేసి...వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కశ్మీరీ పండిట్‌ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అసెంబ్లీకి నామినేట్ చేస్తారని సమాచారం. "ఈ నిర్ణయంతో మూడు దశాబ్దాల బాధ తీరిపోతుంది. రాజకీయ హక్కుల్నీ పొందేందుకు వీలవుతుంది" అని కేంద్రం చెబుతోంది. జమ్ము, కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే...అక్కడ నియోజకవర్గాల పునర్విభజన కొనసాగుతోంది. దీనిపై కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే...పండిట్‌లను అసెంబ్లీకి పంపాలన్న యోచనలో ఉంది.  Delimitation Commission గతేడాదే ఈ సూచన చేసింది. కశ్మీరీ పండిట్‌లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పింది. నిజానికి..కశ్మీరీ పండిట్‌లు ఎన్నో ఏళ్లుగా ఈ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. తమ హక్కుల్ని కాపాడుకోడానికి రాజకీయ ప్రాతినిధ్యం తప్పనిసరి అని అంటున్నారు. డీలిమిటేషన్ కమిషన్‌ ప్రతినిధులు ప్రశ్నించిన సమయం లోనూ వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మందిని బలవంతంగా బయటకు పంపేశారని, సొంత దేశంలోనే పరాయి వాళ్లుగా బతకాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే..కేంద్రం ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా...మరి కొద్ది రోజుల్లోనే ఈ విషయం వెల్లడించే అవకాశముంది. పైగా...త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో  ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు ఇలాంటి నిర్ణయంతీసుకుంటే...తమకూ ప్రయోజనం కలుగుతుందని బీజేపీ భావిస్తుండొచ్చు. 


భయపడుతున్న పండిట్‌లు..


జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్‌లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇటీవల పండిట్‌లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయడంతో అక్కడ పరిస్థితులు భయాందోళనగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇటీవలే షోపియాన్ జిల్లా, చౌదరిగుండ్ గ్రామం నుంచి చిట్ట చివరి కశ్మీరీ పండిట్ మహిళ కూడా ఆ గ్రామాన్ని విడిచి పెట్టింది. చౌదరిగుండ్ గ్రామం నుంచి ఉగ్రవాదుల భయంతో కశ్మీరీ పండిట్‌లు తరలివెళ్లిపోయారు. అయితే డోలీ కుమారి అనే మహిళ మాత్రం ధైర్యంగా అక్కడే ఉంది. ఈ మధ్యే ఆమె కూడా ఆ గ్రామాన్ని విడిచిపెట్టి జమ్మూకు వలస వెళ్లిపోయింది. ఇటీవల కశ్మీరు లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి. దీంతో ఈ గ్రామంలో మిగిలిన ఏడు కశ్మీరీ పండిట్ కుటుంబాలు నెమ్మదిగా జమ్మూకు వలసపోయాయి. 1990ల్లో కశ్మీర్‌ నుంచి వలస వెళ్లని పండిట్‌లు అంతా కలిసి కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (KPSS)ను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలపై ఈ సభ్యులు స్పందించారు. "కశ్మీర్‌ లోయలోని పండిట్‌లందరినీ వెతికి మరీ చంపేస్తాం అనే సంకేతాన్ని టెర్రరిస్టులు ఇస్తున్నారు" అని ఆందోళన చెందుతున్నారు. "లోయలోని కశ్మీరీ పండిట్‌లు అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరుస దాడులతో టెర్రరిస్ట్‌ల లక్ష్యమేంటో స్పష్టంగా తెలుస్తోంది" అని కలవర పడుతున్నారు. 


Also Read: Viral News: కొంప ముంచిన బెట్ సరదా, స్టేజ్‌పై వధువుకి ముద్దు పెట్టినందుకు పెళ్లి క్యాన్సిల్