Special Status For Bihar: తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నో రోజులుగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైగా ఇప్పుడు NDA మిత్రపక్షాల్లో జేడీయూ కూడా ఉండడం వల్ల స్పెషల్ స్టేటస్ కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. కానీ అందుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే బిహార్‌లో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. నితీశ్ కుమార్‌పై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) తీవ్రంగా మండి పడుతోంది. బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలోనే జేడీయూ ఎంపీ ఆర్థిక మంత్రిత్వ శాఖని ఓ ప్రశ్న అడిగారు. బిహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. అందుకు ఆర్థిక శాఖ తరపున సహాయ మంత్రి పంకజ్ చౌదరి "అలాంటి ఆలోచన ఏమీ లేదు" అని సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయని నితీశ్ భావిస్తున్నారు. అయితే..రాజ్యాంగంలో మాత్రం ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. 1969లో ఐదో ఆర్థిక సంఘం ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కి తప్ప మరే రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు. ఈ స్టేటస్ వస్తే కేంద్రం నుంచి ఆర్థిక పరంగా ఎక్కువ సహకారం అందుతుంది. వచ్చే నిధుల వాటా పెరుగుతుంది. అయితే...ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ బిహార్ ప్రత్యేక హోదా కీలక అంశమైంది. 






జేడీయూ ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా సాధించాలని చూస్తోంది. అయితే..ఈ సారి బీజేపీకి మెజార్టీ రాకపోవడం వల్ల జేడీయూ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జేడీయూ ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదాపై చాలా పట్టుదలతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలానే వివక్ష చూపిస్తున్నారని మండి పడుతున్నారు. నితీశ్ కుమార్ గతంలో ఈ హోదా కోసం భారీ ర్యాలీలు నిర్వహించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చేలా అయినా డిమాండ్ వినిపించాలని జేడీయూ ఎంపీలు భావిస్తున్నారు. కూటములు మార్చడంలో నితీశ్‌కి ట్రాక్‌ రికార్డ్ ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండీ కూటమిలో ఉన్న ఆయన ఎన్నికలు దగ్గర పడే సమయానికి NDAలో చేరారు. అప్పుడే ప్రత్యేక హోదా తీసుకొస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంలో JDU కీలక పాత్ర పోషించింది. అందుకే కచ్చితంగా స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ కేంద్రం ఆ ఆశలపై నీళ్లు చల్లింది. 


Also Read: Kanwar Yatra: కన్వార్‌ యాత్ర వివాదంలో యూపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, ఉత్తర్వులు ఆపేయాలని నోటీసులు