Centre proposes to increase Lok Sabha seats to 850:   లోక్‌సభ సీట్ల సంఖ్యను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదిస్తూ కేంద్రం గురువారం నాడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా రాష్ట్రాల నుండి 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 35 సీట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. గత రెండు వారాలుగా ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతుండగా, మంగళవారం నాడు ఎంపీలకు ఈ ముసాయిదా చట్టం ప్రతులను పంపిణీ చేయడంతో ఈ ప్రక్రియ అధికారికంగా ముందడుగు పడింది.               

Continues below advertisement

రాజ్యాంగంలోని అధికరణ 82 ప్రకారం, ప్రతి జనాభా గణన తర్వాత రాష్ట్రాలకు కేటాయించే లోక్‌సభ సీట్లను జనాభా మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల విభజన 1971 జనాభా గణన ఆధారంగా జరిగింది. 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన వరకు నియోజకవర్గాల సరిహద్దుల మార్పుపై నిషేధం ఉంది. అయితే, తాజా బిల్లులో ఈ నిబంధనను సవరించి, 2011 జనాభా గణన ఆధారంగానే ఈ పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.

మహిళా రిజర్వేషన్ల అమలుతో ఈ డిలిమిటేషన్ ప్రక్రియ ముడిపడి ఉండటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే ఇది జనాభా గణన మరియు డిలిమిటేషన్ తర్వాతే సాధ్యమని ప్రభుత్వం గతంలో పేర్కొంది. తాజా ప్రతిపాదనల ప్రకారం సీట్ల సంఖ్యను 850కి పెంచితే, అందులో సుమారు 270 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి.                            

Continues below advertisement

లోక్‌సభ స్థానాలను దాదాపు 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఈ ప్రక్రియ కేవలం అంకగణితంలా కాకుండా రాజకీయంగా అందరికీ సమన్యాయం చేసేలా ఉండాలని కోరింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు, కేవలం జనాభా తక్కువగా ఉందన్న కారణంతో పార్లమెంట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోకూడదని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నందున, సీట్ల పెంపు వల్ల వారికి అదనపు లబ్ధి చేకూరితే దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కినట్లు అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.                      

ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పొడిగించిన ప్రభుత్వం, ఈ మూడు రోజుల ప్రత్యేక వ్యవధిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి లాంటి నేతలు ప్రతిపాదిస్తున్న  హైబ్రీడ్ మోడల్,  రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా సీట్లు పెంచే వ్యూహాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా, దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే ఈ డిలిమిటేషన్ ప్రక్రియపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.