Delhi Liquor Scam Arrest :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులని సీబీఐ వరుసగా అరెస్ట్ చేస్తోంది. మంగళవారం ఏ-5 నిందితుడు విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు బుధవారం తెల్ల వారు జామునే మీర్ మహేంద్రును అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో A-8గా సమీర్ మహేంద్రు పేరు నమోదు చేశారు. ఇండో స్పిరిట్‌ ప్రైవేట్ లిమిడెట్ సంస్థకు సమీర్ మహేంద్రు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ కేసులో 14వ నిందితుడుగా ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిసి సమీర్ మహేంద్రు వ్యాపారం చేస్తున్నారు. ఈ స్కామ్‌లో ఇద్దరు కలిసి 2 కోట్ల30 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసిన డబ్బులను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లుగా సీబీఐ ఆరోపిస్తోంది.  


ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన సీబీఐ 


సమీర్ మహేంద్రు మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నగదు లావాదేవీలను చూసుకున్నట్లుగా సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. డొల్ల కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ చేస్తూ.. ఢిల్లీ లిక్కర్ పాలసీలో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. సౌత్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నామంటూ.. డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ డబ్బుకు సంబంధించి లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి డబ్బును ఢిల్లీ వరకు ఎలా తీసుకొచ్చారు.. అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


అవినీతి ఆర్థిక లావాదేవీలన్నీ సమీర్ మహేంద్రునే నిర్వహించారని ఆరోపణలు


సీబీఐ మనీ లాండరింగ్ ఇతర వివరాలు చూడటం లేదు. పూర్తిగా అవినీతి వ్యవహారాలపైనే దృష్టి సారించింది. ఢిల్లీ లో ప్రభుత్వం నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఖర్చు పెట్టిన మొత్తం ఢిల్లీ మద్యం పాలసీదేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ దక్షిణాది రాష్ట్రాల నుంచి .. లిక్కర్ పాలసీలో అవినీతి ద్వారా సేకరించారని అంటున్నారు. అరెస్టుల పర్వం ఇంకా కొనసాగనుందని తెలుస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు.. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారులను అరెస్టు చేసే అవకాసమున్నట్టు సమాచారం.


చురుకుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ 


ఈడీ కూడా ఈ కేసు విషయంలో ఇప్పటికేరంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి మనీలాండరింగ్ అంశంలో కీలక ఆధారాలు సేకరించింది. ఈ వ్యవహారంలో చేతులు మారిన డబ్బు కొద్ది మొత్తంలో ఉన్నా.. బ్లాక్ మనీని వైట్ చేసుకునే క్రమంలో చాలా వేల కోట్ల వ్యవహారం నడిచినట్లుగా అనుమానిస్తున్నారు. సమీర్ మహేంద్రు.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైతో   ఆర్థిక వ్యవహారాలు నడిపారు. పిళ్లై.కు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. సీబీఐ, ఈడీ అధఇకారులు నిర్వహిస్తున్న సోదాలు, విచారణల్లో ముందు ముందు రాజకీయంగా కూడా సంచలనాత్కమైన విషయాలు బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది.  


వైఎస్ఆర్‌సీపీలో ఐ ప్యాక్ అలజడి - అసంతృప్తిలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు!?