Cancer in India: 


ఐదేళ్లలో ముప్పు పెరుగుతుంది..


ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటోంది క్యాన్సర్ మహమ్మారి. భారత్‌లోనూ బాధితులు పెరుగుతున్నారు. ముఖ్యంగా మహిళలను ఈ వ్యాధి వేధిస్తోంది. జీవనశైలిలో మార్పులు రావడమూ ఇందుకు ఓ కారణం. ముందుగా గుర్తించగలిగితే కాస్తో కూస్తో వైద్యం ద్వారా ఆ ముప్పు నుంచి తప్పించుకునే వీలుంటోంది. ఈ చికిత్సలో కాస్త ఆలస్యమైనా ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటికే క్యాన్సర్ పేరు చెబితేనే భయపడిపోతుంటే ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు.
త్వరలోనే భారత్‌లో క్యాన్సర్ సునామీ రాబోతుందని హెచ్చరించారు. ఐదేళ్లలో ఈ ముప్పు పెరుగుతుందని తేల్చి చెప్పారు. ఉద్యోగులందరికీ క్యాన్సర్ అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసిన టీటీడీ ఆయుర్వేద హాస్పిటల్ వైద్యులు...ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోకపోతే క్యాన్సర్ మహమ్మారి దాడి చేస్తుందని స్పష్టం చేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. క్యాన్సర్ సోకకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. మొత్తం మూడు రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో "జీవనశైలి వ్యాధులకు ఆయుర్వేద పరిష్కారం" పేరుతో సెషన్ ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ప్రసంగించిన ఎస్వీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒబెసిటీ,డయాబెటిస్, హైపర్‌ టెన్షన్, కార్డియాక్ సమస్యలకు ఆయుర్వేదం ద్వారా ఇంటి వైద్యంతోనే చెక్‌ పెట్టొచ్చని చెప్పారు. 


అలోపతితో పాటు ఆయుర్వేదం..


అలోపతి వైద్యం తీసుకుంటున్న వారు కూడా ఆయుర్వేద మందులు వాడొచ్చని, తద్వారా జబ్బు మరింత తీవ్రం కాకుండా చూడొచ్చని వివరించారు. నల్లేరు, అలోవెరా, ఆమ్లా, అర్క, జిల్లేడు లాంటి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని చెప్పారు. త్వరలోనే TTD ఆయుర్వేదిక్ ఫార్మసీ సెంటర్ 314 రకాల మందులు తీసుకురానున్నట్టు వివరించారు. ఆ తరవాత డాక్టర్ సుభాషిణి కూడా ప్రసంగించారు. గుండెపోటు వచ్చిన సమయంలో బాధితుడికి ప్రాథమికంగా ఎలాంటి చికిత్స అందించాలో వేదికపైనే మాక్‌ డిస్‌ప్లే చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో  Cardio Pulmonary Resuscitation ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. అందరూ దీనిపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. ఆ తరవాత  ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ రాణి సదా శివమూర్తి మాట్లాడారు. మూలికా వైద్యంతో కొన్ని జబ్బుల్ని ఎలా నయం చేసుకోవచ్చో తెలిపారు. ఈ కార్యక్రమంలో 1500 మంది ఉద్యోగులతో పాటు Sri Venkateshwara Employees Training Academy డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు.  


ది లాన్సెట్ పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం చీజ్, సాల్ట్ వేసిన వేరుశెనగలు, పాస్తా సాస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో చాలా కృత్రిమ రంగులు, రుచులు, స్వీటెనర్లు, ప్రిరెజర్వేటివ్‌లు ఉంటాయి.  వినియోగదారుల కంటికి, నాలుకకు వచ్చే విధంగా చేయడం కోసం ...అనేక ప్రాసెసింగ్ పద్ధతులను వీటి తయారీలో ఉపయోగిస్తారు. అందుకే వీటిని తీసుకోవడం వల్ల అండాశయం, మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. జన్యుపరంగా అంటే వారసత్వంగా వచ్చే క్యాన్సర్లను నివారించడం కష్టమే, కానీ జీవనశైలి ఆహారం వంటి బాహ్య కారకాల వల్ల వచ్చే క్యాన్సర్లను అడ్డుకోవచ్చు.


Also Read: Viral News: వాట్సాప్‌ కాల్‌ ద్వారా డెలివరీ చేసిన వైద్యులు, తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్