కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన కెనడా తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. జీ 20 శిఖరాగ్ర సదస్సు కోసం శుక్రవారం భారత్‌కు వచ్చిన ట్రూడో ఆదివారం రాత్రి సమావేశాల అనంతరం తిరిగి కెనడా వెళ్లాల్సి ఉండగా విమానంలో సమస్య తలెత్తింది. దీంతో ట్రూడోతో పాటు ఆయనతో వచ్చిన ఇతర ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులు నిన్న రాత్రి నుంచి దిల్లీలోని ఉండిపోవాల్సి వచ్చింది. విమానంలో ఏర్పడిన సమస్య రాత్రికి రాత్రి పరిష్కారం అయ్యేది కాదని, ప్రయాణానికి వేరే ఏర్పాట్లు చేసే వరకు తమ డెలిగేట్స్‌ అంతా భారత్‌లోనే ఉంటారని ట్రూడో కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. విమానంలో సాంకేతిక సమస్య పరిష్కారానికి తమ వైమానిక దళ సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపారు.


జీ 20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కొద్దిసేపు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కెనడా సిక్కు వేర్పాటు వాదులకు ఆశ్రయమిస్తోందని మోదీ విమర్శలు చేశారు. కెనడా నుంచి కొన్ని గ్రూపులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, అది ఆందోళనకరంగా ఉందని మోదీ ట్రూడోతో తన అభిప్రాయం వెల్లడించారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాంటి వ్యవస్థీకృత నేరాలు, డ్రగ్స్‌ సిండికేట్స్‌, మానవ అక్రమరవాణా చేసే గ్రూప్స్‌తో కెనడాకు కూడా నష్టం వాటిల్లుతుందని, ఇటువంటి వాటిని ఎదుర్కోవడంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం చాలా అవసరమని మోదీ సూచించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే మోదీ, ట్రూడో మధ్య అధికారికంగా ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. కానీ చిన్న మీటింగ్‌లో పాల్గొన్నారు. చర్చల్లో విదేశీ జోక్యం, చట్టాలను గౌరవించడం అంశాల గురించి మాట్లాడినట్లు ట్రూడో తెలిపారు.


సిక్కు వేర్పాటువాదులు సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కెనడాలో ఓ రెఫరెండం నిర్వహించారు. తమ కమ్యునిటీ వారు మెజార్జీగా ఉన్న భారత్‌లోని ప్రాంతాలు స్వతంత్రంగా ఉండాలా వద్దా అని అక్కడి ప్రవాసులను అభిప్రాయం తెలియజేయాలని అడిగారు. జూన్‌ నెలలో కెనడాలోని ఒట్టావా నగరంలో హైకమిషన్‌ కార్యాలయం ఎదుట సిక్కు వేర్పాటు వాదులు నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. అక్కడి ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీ దీనిని దాడిగా పరిగణించి దర్యాప్తు చేస్తోంది. పంజాబ్ వేర్పాటువాదులు కెనడాలో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఎప్పటి నుంచో భారత అధికారులు ఆరోపిస్తున్నారు.


అయితే కెనడా గత వారం తమ దగ్గర జరిగిన జాతీయ ఎన్నికల్లో విదేశాల జోక్యంపై బహిరంగ విచారణను ప్రారంభించింది. చైనా, రష్యా సహా ఇతర దేశాలపై ఫోకస్‌ చేసింది. అయితే కెనడాలో విదేశీ జోక్యానికి భారత్‌ ప్రధాన కారణమని ట్రూడో జాతీయ భద్రతా సలహాదారు జోడీ థామస్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కెనడాలో పంజాబ్‌ వేర్పాటువాదుల అంశం, అలాగే కెనడా వ్యవహారాల్లో భారత్‌ జోక్యం అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు ట్రూడో తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛ, తప్పొప్పులు నిర్ణయించుకునే స్వేచ్ఛ, శాంతియుత నిరసనను కెనడా ఎల్లప్పుడూ సమర్థిస్తుందని, అది తమకు చాలా ముఖ్యమైన విషయమని ట్రూడో దిల్లీలో ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే తాము హింసను నిరోధించడానికి, ద్వేషానికి తగ్గించడానికి ముందుంటామని అన్నారు. కొద్ది మంది చేసే చర్యలు కెనడాకు, అక్కడి సమాజం మొత్తానికి వర్తించదని గుర్తుంచుకోవాలని అన్నారు.