Provisions in CAA: అమెరికా మరోసారి CAA చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టంలోని కొన్ని ప్రొవిజన్స్‌ భారత దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశముందని అభిప్రాయపడింది. ఓ ఇండిపెండెంట్ రీసెర్చ్ ఈ విషయం వెల్లడించింది. 1955 నాటి Citizenship Actలో పలు మార్పులు చేర్పులు చేసి బీజేపీ ప్రభుత్వం ఇటీవలే  Citizenship Amendment Act ని అమల్లోకి తీసుకొచ్చింది. అమెరికాకి చెందిన  Congressional Research Service (CRS) పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావించింది. కేవలం ఆరు మతాలకు చెందిన వాళ్లకే దేశ పౌరసత్వం కల్పిస్తామని చెప్పి, ముస్లింలను ఆ జాబితాలో చేర్చకపోవడంపై అందులో పేర్కొంది. భారత రాజ్యాంగంలోని కొన్ని అధికరణలు ఉల్లంఘనకు గురయ్యే అవకాశముందని వెల్లడించింది. అంతే కాదు. National Register of Citizens (NRC)తో పాటు CAA దేశంలోని ముస్లింల హక్కుల్ని అణిచివేసే ప్రమాదముందని తెలిపింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారని వెల్లడించింది. హిందువులకు అనుకూలంగా ఉండడం, యాంటీ ముస్లిం అజెండాని ప్రచారం చేయడం భారత ప్రతిష్ఠకి భంగం కలిగించే ప్రమాదముందని అభిప్రాయపడింది. లౌకికవాదాన్ని విశ్వసించే ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇలాంటి చట్టం చేయడం ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనల్నీ ఉల్లంఘించినట్టవుతుందని వివరించింది. 


బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల రాజకీయ కోణంలేనే చూడాల్సి వస్తోందని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. కేవలం తాము ఆమోదించిన మతాలకు చెందిన పౌరులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తామని చెప్పడంపైనా ఆందోళన వ్యక్ం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన సమయంలోనూ అమెరికా ఇలానే స్పందించింది. CAAపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించింది.