KTR Fun With Assembly Speaker Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) గురువారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆయన్ను స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కూడా ఆయనకు విషెష్ చెప్పారు. అయితే, ఆయన స్పీకర్ తో 'అప్పుడప్పుడూ కాస్త లెఫ్టుకు కూడా చూడండి' అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. కేటీఆర్ ఫన్నీ కామెంట్స్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్, పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ కనిపించారు.



మీ ఎన్నిక ఆ పదవికే వన్నె తెచ్చింది


తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్పీకర్ గా ఎన్నికైన మీ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తి దాయకమని సీఎం అన్నారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఆ పదవికే వన్నె తెచ్చిందని మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలు, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. శాసన సభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్ పై తనకు పూర్తి నమ్మకం ఉన్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అనంతరం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.


మీ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం


తెలంగాణ నూతన శాసన సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంపీటీసీ నుంచి శాసన సభాపతి వరకు ఎదిగిన మీ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారని వెల్లడించారు. '2012 నుంచి 14 వరకూ చేనేత జౌళి శాఖ మంత్రిగా నేను పని చేసిన సమయంలో మీరు సిరిసిల్లకు వచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు. మాజీ స్పీకర్లు మధుసూదనా చారి, పోచారం శ్రీనివాసరెడ్డి నెలకొల్పిన సంప్రదాయాలను, కాపాడిన విలువలను పరిరక్షిస్తారని ఆకాంక్షిస్తున్నా.' అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని కేటీఆర్ తెలిపారు.  గాయం కారణంగా దురదృష్టవశాత్తు కేసీఆర్ సభకు హాజరు కాలేక పోయారని చెప్పారు. ప్రజల తరఫున మాట్లాడే వారి గొంతును వినిపించేలా బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 



Also Read: Telangana Assembly New Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పీఠంపై తొలి దళిత నేత - బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్