KTR: మూడు ఫీట్లు లేనోడు మనల్ని 100 మీటర్ల లోతు బొంద పెడతాడా? - కేటీఆర్ వ్యాఖ్యలు

ABP Desam Updated at: 29 Jan 2024 06:09 PM (IST)

BRS News: చేవెళ్ల నియోజకవర్గంలోని కేసీఆర్ గార్డెన్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కేటీఆర్

NEXT PREV

KTR Comments on CM Revanth Reddy: కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలను కాంగ్రెస్ సర్కార్ నిజంగానే అమలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మార్పు కావాలి అన్న వారు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నరని అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని కేసీఆర్ గార్డెన్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 



ఆయన మూడు ఫీట్లు కూడా లేడు.. మనల్ని 100 మీటర్ల లోతున బొంద పెడతడంట. ఈ ప్రగల్భాలు, పిచ్చి మాటలు రేవంత్ రెడ్డి కంటే ముందు ఆయన గురువుగారు మాట్లాడారు. అందరి చెవులల్లో ఊది ఢిల్లీ నుంచి మేనేజ్ చేసి తెచ్చుకున్న పదవి తప్ప.. అందరు కలిసి కూడబలుక్కొని నిన్ను ఎన్నుకోలేదు. ఏ నాటికి నువ్వు కేసీఆర్ కాలి గోటి కిందికి కూడా సరిపోవు-


ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరు అధైర్య పడవద్దు కారు సర్వీసింగ్ కు పోయింది. మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తది. బలమైన ప్రతిపక్షంగా ఉన్నం. ప్రజల తరపున ప్రశ్నిస్తాం. పోరాడుతాం. గత పదేళ్ళల్లో మన మధ్య సమన్వయం లోపించింది వాస్తవం. ఇప్పుడు అలా జరగకుండా చూస్తాం. 119 సీట్లలో 39 సీట్లు బలమైన ప్రతిపక్షంగా ఉన్నం. 14 సీట్లు ఐదు వేల ఓట్ల లోపే ఓటమి పాలైనం అందులో సగం గెలిచినా వేరే విధంగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ లు రోడ్డున పడ్డారు.


‘‘కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలు కాంగ్రెస్ సర్కార్ నిజం చేస్తోంది. మార్పు కావాలి అనోళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నరు. ఇప్పటి వరకు రైతు బంధు పైసలు పడలే కేసీఆర్ ప్రభుత్వంలో వారం రోజుల్లో రైతు బంధు పడేది. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టమని అన్నాడు మంత్రి కోమటిరెడ్డి. చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో కొట్టాలి. రేవంత్ రెడ్డి చెప్పిన రెండు లక్షల రుణమాఫీ ఏది లక్షా రూపాయలు తులం బంగారం ఎక్కడ పాయే. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవెళ్ల చౌరస్తాలో నిలబెడతాం. కార్యకర్తలకు అండగా ఉంటం భయపడకండి. లంకెబిందెలున్నాయని వస్తే ఖాళీ బిందెలున్నాయని అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు విడ్డూరంగా అంటున్నారు. కనీసం మంత్రిగా పని చేయనోడు ముఖ్యమంత్రిని చేస్తే ఇట్లే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుదాం. 50 రోజుల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంటుంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. ఇచ్చిన హామీలపై ప్రజలను చైతన్య వంతులను చేస్తే నాపై మాటల దాడి చేస్తుండ్రు. ఇచ్చిన హామీలన్నింటికి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు జీవోలిచ్చి చిత్తశుద్ధి నిలుపుకోవాలి. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలే. పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించాలే. వరుసగా ఎన్నికలొస్తున్నయ్. అందరూ అప్రమత్తంగా ఉండాలే. కష్టపడి పార్టీ గెలుపుకు కృషి చేయాలే’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు.

Published at: 29 Jan 2024 06:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.