KCR surgery Success: హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (BRS Chief KCR)కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స శుక్రవారం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు కేసీఆర్ కు నిర్వహించిన సర్జరీ సక్సెస్ అయిందని సోమాజిగూడలోని యశోద వైద్యులు శుక్రవారం రాత్రి తెలిపారు. కేసీఆర్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే తమ ముందుకు వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 




కేసీఆర్ సర్జరీ సక్సెస్ అయిన తరువాత శనివారం వైద్యుల సూచనతో వారి పర్యవేక్షణలో కాసేపు నడిచారు. తుంటి ఎముక మార్పిడి అయిన కారణంగా కేసీఆర్ వాకర్ సాయంతో నడిచారు. వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్ లో కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోలు విడుదల చేశారు. ఈ వీడియో, ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ పరిస్థితి చూసి కొందరు ఆశ్చర్యపోతుండగా, తమ అధినేత కోలుకుంటున్నారని మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.



కేసీఆర్ కు సర్జరీ సక్సెస్..
సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రిప్లేస్‌మెంట్ (తుంటి ఎముక మార్పిడి) సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన తుంటి ఎముక మార్పిడి సర్జరీ రాత్రికి పూర్తి కావడం తెలిసిందే. సర్జరీ పూర్తయిన అనంతరం కేసీఆర్ ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి తరలించారు. శుక్రవారం కేసీఆర్ సతీమణి శోభ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, హరీష్ రావు, సంతోష్ తదితరులు యశోద హాస్పిటల్ లో ఉండి కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.


ఫాం హౌస్ లో జారిపడిన కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో గురువారం అర్ధరాత్రి బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. దాంతో కేసీఆర్ నడుము భాగాన ఎడమ కాలికి తుంటి భాగంలో లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం కేసీఆర్ ను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు హిప్ బోన్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 3 గంటలపాటు కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి సర్జరీ జరిగింది. 


ఎర్రవెళ్లి ఫాం హౌస్ లో వరుస సమావేశాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ విడిచిపెట్టి ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌ కు వెళ్లారు. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక నేతలు ఫాం హౌస్ కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఆ తరువాత వరుసగా మూడు, నాలుగు రోజులపాటు స్థానిక ప్రజలతో సమావేశం అయ్యారు. సొంత గ్రామం చింతమడక నుంచి సైతం ప్రజలు భారీగా తరలివచ్చి కేసీఆర్ ను కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు.