Delhi Liquor Policy Case Updates: లిక్కర్ పాలసీ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకి ఎలక్టోరల్ బాండ్స్ కేసుకి లింక్ ఉన్నట్టు తేలింది. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్స్‌గా మారిన ఓ వ్యక్తి రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇందులో ఎక్కువ వాటా బీజేపీకే అందినట్టు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఈ బాండ్స్‌ని కొనుగోలు చేసింది. గతేడాది నవంబర్‌లో లిక్కర్ పాలసీ కేసులో శరత్ అరెస్ట్ అయ్యారు. ఆ తరవాత ఆయన అప్రూవర్‌గా మారారు. 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలించగా ఈ విషయం తేలినట్టు ఈసీ స్పష్టం చేసింది. రూ.52 కోట్ల విలువైన బాండ్స్‌ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసి బీజేపీకి భారీ మొత్తంలో డొనేట్ చేసినట్టు తెలిపింది. ఇందులో దాదాపు 66% మేర బీజేపీకి వెళ్లగా..మిగతా విరాళాలు BRS,TDPకి అందినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 


2022లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన ఐదు రోజుల తరవాత రూ.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. నవంబర్ 10వ తేదీన అరెస్ట్ కాదా..నవంబర్ 15న ఈ బాండ్స్‌ని కొనుగోలు చేసినట్టు ఈసీ డేటా వెల్లడించింది. నవంబర్ 21వ తేదీన బీజేపీ వీటిన ఎన్‌క్యాష్ చేసుకుంది. 2023 జూన్‌లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. నిజానికి ఆప్ మంత్రి అతిషి ఇప్పటికే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకే నిధులు మళ్లాయని ఆరోపించారు. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఈసీ విడుదల చేసిన లెక్కల్లో అదే విషయం వెల్లడైంది. 2021 నవంబర్‌కి ముందు శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలో 5 జోన్స్‌లో లిక్కర్‌ వెంట్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి వచ్చిందని అతిషి వివరించారు. లిక్కర్ పాలసీ 2021 నవంబర్‌లో అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ అమల్లో ఉన్నప్పుడే బీజేపీకి అరబిందో కంపెనీ నుంచి రూ.3 కోట్ల విరాళం వచ్చినట్టు అతిషి ఆరోపించారు. 


"శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్‌ ద్వారా శరత్ బీజేపీకి రూ.4.5 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇదంతా ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో భాగమే. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరవాత బీజేపీకి రూ.55 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ డబ్బంతా బీజేపీ బ్యాంక్ అకౌంట్‌కే నేరుగా వెళ్లింది. ఈడీ కచ్చితంగా జేపీ నడ్డాని అరెస్ట్ చేయాల్సిందే. మొదటిసారి ఈ లిక్కర్ పాలసీ కేసులో ఈ కోణం బయటపడింది. ఇప్పటి వరకూ ఎవరి నుంచీ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు"


- అతిషి, ఢిల్లీ మంత్రి


 Also Read: మాస్కో ఉగ్రదాడి ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య - టాయిలెట్‌లో డెడ్‌బాడీలు