Bihar Political Crisis: కొద్ది రోజుల సస్పెన్స్‌కి తెర దించుతూ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (CM Nitish Kumar Resigns:) చేశారు నితీశ్ కుమార్. గవర్నర్‌కి ఆయన రాజీనామా లేఖ సమర్పించారు. ఆ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అటు NDAతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు నితీశ్ కుమార్. ఇప్పటికే బీజేపీ మద్దతు ప్రకటిస్తూ పంపిన లేఖని గవర్నర్‌కి అందించారు. ఆ లేఖని గవర్నర్ ఆమోదించారు.





ఈ క్రమంలోనే నితీశ్ కుమార్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కాల్ చేశారు. NDAలోకి మళ్లీ వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజీనామా నిర్ణయం తీసుకున్నందుకు అభినందించారు. నితీశ్ కుమార్ 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు డిప్యుటీ సీఎంలుగా విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరి బాధ్యతలు తీసుకోనున్నారు. వీళ్లతో పాటు మరి కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అటు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా నితీశ్‌ని అభినందించారు. రాజీనామా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 


"నితీశ్ కుమార్ రాజీనామా చేయడం చాలా సంతోషంగా ఉంది. గత ఏడాదిన్నరగా బిహార్‌లో సరైన పాలన కనిపించలేదు. ఒకవేళ తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి అయ్యుంటే పరిస్థితి మరీ దీనంగా ఉండేదేమో. ఇన్నాళ్లూ ఇక్కడ ఆటవిక రాజ్యం నడిచింది. కానీ ఇకపై బీజేపీ అలాంటి పాలనను సహించదు"


- గిరిరాజ్ సింగ్, కేంద్రమంత్రి