కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగిస్తోన్న పోరాటానికి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు నేడు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. దిల్లీ, పంజాబ్, హరియాణా రహదారులపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లు యథావిధిగా సాగుతున్నాయి.
కిసాన్ భారత్ బంద్..
- 40 సంఘాల రైతులు ఏకతాటిపైకి వచ్చి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేెఎమ్) ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారులపై వాహనాలను వెళ్లనివ్వటం లేదు. దిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వేను ఘాజీపుర్ వద్ద రైతులు దిగ్బంధించారు.
- గురుగ్రామ్-దిల్లీ సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. దిల్లీలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
- అంబులెన్స్లు, ఆసుపత్రులు యథావిధిగా నడుస్తాయని వాటిని మేం ఆపడం లేదని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసినట్లు తెలిపారు.
- దిల్లీ, పంజాబ్, హరియాణాతో పాటు కర్ణాటక, బిహార్లోనూ భారత్ బంద్ కొనసాగుతోంది.
- కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, టీడీపీ.. సహా పలు విపక్షపార్టీలు ఈ బంద్కు మద్దతిచ్చాయి.