Israel Hezbollah War: "మా జోలికొస్తే ఊరుకోం. మా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాం". ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన ఇది. ఇప్పటికే ఇజ్రాయేల్, హెజ్బుల్లా మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. నార్త్ ఇజ్రాయేల్లోని పౌరుల ప్రాణాలకు భద్రత కల్పిస్తూనే హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. లెబనాన్నై పూర్తి స్థాయిలో యుద్ధం తప్పదని స్పష్టం చేశారు. తమని ఇబ్బంది పెట్టిన వాళ్లెవరినీ వదలమని, వాళ్లనీ ఇబ్బంది పెడతామని అన్నారు. ఇక ఇజ్రాయేల్ మిలిటరీ దూకుడు మీదుంది.
హెజ్బుల్లా రాకెట్ లాంఛర్లు ధ్వంసం..
ఇజ్రాయేల్పైకి ఎక్కుపెట్టిన హెజ్బుల్లా రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసేందుకు ఒకేసారి 100 ఫైటర్ జెట్స్ని రంగంలోకి దింపింది. వేలాది రాకెట్ లాంచర్ బ్యారెల్స్ని ధ్వంసం చేశామని ప్రకటించింది. తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు దాడులను తీవ్రతరం చేయాల్సి వస్తే అందుకూ సిద్ధమేనని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది. ఇజ్రాయేల్ దాడులకు ప్రతీకారంగా హెజ్బుల్లా 320 రాకెట్లను వదిలింది. భారీగా నష్టం కలిగించాలని చూస్తోంది. హెజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్ని చంపినందుకు ఈ దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
48 గంటల ఎమర్జెన్సీ..
ఇప్పటికే ఇజ్రాయేల్ 48 గంటల పాటు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ క్రమంలోనే హెజ్బుల్లా కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయేల్పై మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని వెల్లడించింది. ఇవాళ్టికి ఇంతేనంటూ అధికారికంగా ప్రకటించింది. అంటే మరి కొద్ది రోజుల పాటు ఈ యుద్ధం ఇదే స్థాయిలో భీకరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. . ఈ దాడులకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం 100 యుద్ధ విమానాలు వేలాది హెజ్బుల్లా రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేశాయి. ఇవన్నీ నార్త్ ఇజ్రాయేల్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండగా ఇజ్రాయేల్ సైన్యం వాటిని నిర్వీర్యం చేసింది.
Also Read: Israel: ఇజ్రాయేల్లో 48 గంటల పాటు ఎమర్జెన్సీ,హెజ్బుల్లాపై ప్రతీకార దాడులు - అంతా విధ్వంసమే